విరాటపర్వం సినిమాను బ్యాన్ చేయాల్సిందే..!

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాటపర్వం సినిమా భారీ అంచనాల మధ్య

Update: 2022-06-19 12:22 GMT

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాటపర్వం సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్, గో హత్యలు గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగి వార్తల్లో నిలిచింది. విరాటపర్వం సినిమా నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో నక్సలిజాన్ని మంచిగా చూపించి పోలీసులని చెడుగా చూపించారు. దీంతో ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. విశ్వ హిందూ పరిషత్‌ విద్యానగర్‌ జిల్లా కార్యదర్శి కె.అజయ్‌ రాజ్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు శనివారం సాయంత్రం ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు. విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చాలా అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని పేర్కొన్నారు. అలాగే నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతులు ఇచ్చింది అని ప్రశ్నిస్తూ విరాటపర్వం సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్‌ బోర్డు అధికారి శిఫాలి కుమార్‌ పై కూడా ఫిర్యాదు చేశారు.

ఇక సాయిపల్లవి ఇటీవల కశ్మీరీ పండిట్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెఫ్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని సాయిపల్లవి స్పష్టం చేశారు. హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని.. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు తెలుసని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని అన్నారు సాయి పల్లవి.


Tags:    

Similar News