Iran - Israel War : హిజ్బుల్లా–ఇజ్రాయెల్‌ పోరుతో పెరుగుతున్న ఉద్రిక్తతలు

లెబనాన్‌ నుంచి వెళ్లాలన్న ఆదేశాన్ని ఇరాన్‌ బహిరంగంగా తిరస్కరించింది

Update: 2026-03-31 01:59 GMT

Displaced people who fled Israeli strikes in southern Lebanon sit inside tents used as shelters as a rainbow breaks through the rain in Beirut, Lebanon, 

లెబనాన్‌ నుంచి వెళ్లాలన్న ఆదేశాన్ని ఇరాన్‌ బహిరంగంగా తిరస్కరించింది. తమ రాయబారి అక్కడే కొనసాగుతారని ప్రకటించింది. ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్‌ మధ్య పోరు ముదురుతున్న సమయంలో ఈ నిర్ణయం మరో ఉద్రిక్తతకు దారి తీసింది.లెబనాన్‌ ప్రభుత్వం రాయబారి **మొహమ్మద్ రేజా షిబానీ**ను ‘పర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించింది. ఇరాన్‌ దౌత్య ప్రాభవాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రాయబారి స్థానంలో చార్జ్‌ డి’అఫైర్స్‌ను ఉంచాలని భావించింది. దేశం విడిచి వెళ్లేందుకు ఆదివారం వరకు గడువు ఇచ్చింది. “లెబనాన్‌లో మా రాయబారి కార్యాలయం పనిచేస్తోంది. అక్కడి సంబంధిత వర్గాలు, తీసుకున్న నిర్ణయాల మేరకు మా రాయబారి బీరూట్‌లోనే తన బాధ్యతలు కొనసాగిస్తారు” అని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మీడియాకు చెప్పారు. ఈ విషయంపై లెబనాన్‌ అధికారులు వెంటనే స్పందించలేదు. తదుపరి చర్య ఏంటో స్పష్టత లేదు. రాయబారి దౌత్య రక్షణలో భాగంగా ఎంబసీలోనే ఉన్నారని సమాచారం.

హిజ్బుల్లా ఎంట్రీతో...
ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై కాల్పులు ప్రారంభించడంతో పోరు విస్తరించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ దక్షిణ లెబనాన్‌లోకి దళాలు పంపి, రాజధాని బీరూట్‌లోని కొన్ని ప్రాంతాలపై బాంబుదాడులు చేసింది. లెబనాన్‌ ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.“ఈ ఉదయం ఇరాన్‌ రాయబారి బీరూట్‌లో కాఫీ తాగుతూ ఆతిథ్య దేశాన్ని ఎగతాళి చేస్తున్నారు. లెబనాన్‌ వాస్తవానికి ఇరాన్‌ ఆధీనంలో ఉంది” అని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
ఇరాన్‌ గార్డ్స్‌, హిజ్బుల్లా కార్యకలాపాలపై నిషేధం...
హిజ్బుల్లాను నిరాయుధం చేయాలన్న ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో లెబనాన్‌ ప్రభుత్వం ఆ సంస్థ సైనిక కార్యకలాపాలపై నిషేధం విధించింది. అలాగే ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌ కార్యకలాపాలపైనా ఆంక్షలు పెట్టింది. అనంతరం రాయబారి వెళ్లాలన్న ఆదేశం వెలువడింది. దీనిని హిజ్బుల్లా “అవివేకమైన చర్య”గా ఖండించింది. ఇరాన్‌ రాయబారికి మద్దతుగా ఎంబసీ సమీపంలో ర్యాలీ నిర్వహించింది. గత వారం నుంచి ఈ నిర్ణయాన్ని మార్చించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం, పార్లమెంట్‌ స్పీకర్‌ **నబీహ్ బెర్రీ**పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని లెబనాన్‌కు చెందిన ఒక దౌత్యాధికారి తెలిపారు. బెర్రీ హిజ్బుల్లాకు రాజకీయ మిత్రుడిగా గుర్తింపు పొందారు. వాషింగ్టన్‌తో చర్చలకు లెబనాన్‌లోని యుద్ధాన్ని ఇరాన్‌ షరతుగా పెడుతుండటం హిజ్బుల్లాను నిరాయుధం చేసే ప్రయత్నాలపై ప్రభావం చూపుతుందని బీరూట్‌ ఆందోళన చెందుతోందని ఆ అధికారి చెప్పారు.
దౌత్య ప్రయత్నాలపై ప్రభావం...
ఈ విభేదాలు యుద్ధానికి ముగింపు దిశగా లెబనాన్‌ చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరుస్తున్నాయి. రాష్ట్రపతి జోసెఫ్ ఆఊన్, ప్రధానమంత్రి నవాఫ్ సలాం ఇజ్రాయెల్‌ దాడులను విమర్శించినప్పటికీ, ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించడాన్ని ఖండించారు. నవంబర్‌ 2024లో ముగిసిన గత యుద్ధం తర్వాతే ఆఊన్‌, సలాం అధికారంలోకి వచ్చారు. హిజ్బుల్లాతో పాటు ఇతర సాయుధ గుంపులను నిరాయుధం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ దేశంలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విదేశాంగ మంత్రి యూసుఫ్ రాజ్జీ రాయబారి వెళ్లాలన్న ఆదేశాన్ని ప్రకటించిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తమైంది. రాజ్జీ హిజ్బుల్లాకు ప్రత్యర్థిగా ఉన్న క్రిస్టియన్‌ లెబనీస్‌ ఫోర్సెస్‌ పార్టీ తరఫున కేబినెట్‌లో ఉన్నారు. “మంటలతో ఆడుకోవద్దు. ఈ మంటలు మీకూ, మీ ప్రజలకూ, మీ వెనుక ఉన్నవారికీ దహనం చేస్తాయి” అని హిజ్బుల్లా రాజకీయ విభాగానికి చెందిన మహ్మూద్ కమాతీ రాజ్జీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News