గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష.. ఏమి నేరం చేసిందో తెలుసా ?

ఆగ్రహించిన మహిళ బంధువులు.. ఆమె మృతికి కారణమైన పొట్టేలుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ అనే వ్యక్తికి చెందిన..

Update: 2022-05-24 12:35 GMT

ఆఫ్రికా : అప్పుడప్పుడు కొన్ని వింత వింత ఘటనలు చూస్తుంటాం.. వింటుంటాం. ఇటీవల తెలంగాణలో ఓ కోడికి బస్ టికెట్ ఇచ్చిన ఘటన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇలా జంతువుల విషయాల్లో జరిగే కొన్ని సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఒక గొర్రెకు కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చిన ఘటన వెలుగుచూసింది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు కానీ.. నెటిజన్లను ఈ విషయం బాగా ఆకర్షిస్తోంది.

ఒక మహిళను పొట్టేలు పరిగెత్తించింది. ఆమెను కిందపడేసి పదే పదే కొమ్ములతో కుమ్మేసింది. దాంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా.. ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని, మహిళ చనిపోయిందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికాలోని సౌత్ సుడాన్ లోని మాన్యాంగ్ ధాల్ లో జరిగిందీ ఘటన. అకుల్ యోల్ ప్రాంతంలో.. ఆదియు చాంపింగ్ (45) అనే మహిళపై ఒక గొర్రె దాడిచేసింది. గొర్రె దాడికి మహిళ అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహిళ పక్కటెముకలు విరిగిపోయి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఆగ్రహించిన మహిళ బంధువులు.. ఆమె మృతికి కారణమైన పొట్టేలుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ అనే వ్యక్తికి చెందిన ఆ గొర్రెపై కేసు నమోదు చేశారు. చనిపోయిన మహిళ ఆ వ్యక్తికి బంధువు కూడా. పోలీసులు పొట్టేలుతో పాటు రామ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును విచారించిన కోర్టు.. మహిళ మృతికి కారణమైన పొట్టేలుకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఊహించని తీర్పు వెలువరించింది. శిక్ష కాలం పూర్తయిన అనంతరం గొర్రెను బాధిత కుటుంబానికి చెందుతుందని కోర్టు తీర్పులో పేర్కొంది.





Tags:    

Similar News