ఫ్యాక్ట్ చెక్: జాతీయ జెండాతో పాదరక్షలను తుడుచుకున్న బీజేపీ కార్యకర్తలు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
జాతీయ జెండాతో పాదరక్షలను తుడుచుకుంటున్న బీజేపీ కార్యకర్తలు
జాతీయ జెండాకు, జాతీయ గీతానికి, జాతీయ గేయానికి సరైన గౌరవం దక్కాల్సిందే. ఇకపై అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వందేమాతరం ఆలపించే చోట సభికులంతా శ్రద్ధగా లేచి నిల్చోవాల్సిందేనని సూచించింది. వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్రపతి రాక, త్రివర్ణపతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు తదితర సందర్భాలలో 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధితో జాతీయ గేయంలోని ఆరు చరణాలను పాడాలని పేర్కొంది. పాఠశాలల కార్యకలాపాలు జాతీయ గేయం ఆలాపనతోనే మొదలవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ సంవత్సర వేడుకలను నిర్వహిస్తూ ఉంది. జాతీయ జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్లు తప్ప ఇతర ఉత్సవ కార్యక్రమాలు, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి, లేదా ప్రజాకార్యక్రమానికి రాష్ట్రపతి రాక తదితర సందర్భాలలో జాతీయ గేయంను ఆలపించాలని ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలల నిర్వాహకులు తమ కార్యక్రమాలలో జాతీయ గేయం, జాతీయ గీతం ఆలాపనకు, విద్యార్థుల్లో జాతీయ జెండా పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించింది.
అయితే “జాతీయ జండాతో బూట్లు తుడుచుకుంటున్న బీజేపీ కార్యకర్తలు” అంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఓ గుంపుకు సంబంధించిన వ్యక్తులు మూడు రంగుల జెండాతో బూట్లను శుభ్రం చేసుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు.
ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో ఉన్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జెండా.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాతో బూట్లు తుడుచుకునే పని చేసినట్లుగా ఎలాంటి మీడియా నివేదిక లభించలేదు.
వైరల్ వీడియోను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆగస్టు 30, 2025న పోస్టు చేసిన ANI వీడియో మాకు లభించింది.
ఇది గుజరాత్ లో చోటు చేసుకున్న ఘటన అని మీడియా కథనాల్లో నివేదించారు. ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సూరత్లో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. పోలీసు సిబ్బంది కూడా ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఉన్నారు. వీడియోలో కొందరు కాంగ్రెస్ పార్టీ జెండాతో చెప్పులు తుడుచుకోవడం చూడొచ్చు.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
పలు మీడియా సంస్థలు కూడా ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను షేర్ చేశాయి. అందుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ ఉన్నాయి.
జెండాపై కాంగ్రెస్ పార్టీకి చెందిన చేయి గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. అది జాతీయ త్రివర్ణ పతాకం కాదు, కాంగ్రెస్ పార్టీ జెండానే అని తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ వీడియోలో ఉన్నది భారత జాతీయ జెండా కాదు. కాంగ్రెస్ పార్టీ జెండా.
Claim : అది భారత జాతీయ జెండా కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా
Claimed By : Social Media Users
Fact Check : Unknown