Tirumala : తిరుమలలో నేడు దర్శనం మళ్లీ ఎప్పటి నుంచి అంటే?
తిరుమలలో భక్తులు నేడు కంపార్ట్ మెంట్లలోనే ఉండాల్సి వస్తుంది.
తిరుమలలో భక్తులు నేడు కంపార్ట్ మెంట్లలోనే ఉండాల్సి వస్తుంది. ఉదయం 9 గంటల వరకే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. తర్వాత ఆలయ ద్వారాలను మూసివేస్తారు. దీంతో క్యూ లైన్ లో ఉన్న వారు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు. తిరిగి రాత్రి 7.30 గంటల తర్వాత మాత్రమే తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. అప్పటి వరకూ భక్తులను అనుమతించరు. చంద్రగ్రహణం కారణంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఆలయాలను మూసివేస్తారు.
రాత్రి ఏడున్నర గంటల నుంచి...
తిరిగి రాత్రి 7.30 గంటల నుంచి భక్తులకు అనుమతిస్తారు. అప్పటి వరకూ కంపార్ట్ మెంట్లలో ఉండే భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. అయితే భక్తులకు మజ్జిగ,పాలు, మంచినీరు వంటివి మాత్రమే అందిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులు సంయమనం పాటించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. చాలా మంది దర్శనం చేసుకోవడానికి బారులు తీరుతారని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
నిన్న క్యూలైన్లలో...
తిరుమల లోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు పరస్పర ఘర్షణ కు దిగిన సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది మరియు శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించారు.శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహ పూర్వకంగా ఉండాలని ,అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.