Tirumala : హమయ్య తిరుమలలో కొంత రష్ తగ్గింది.. భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. నిన్నటి వరకూ భక్తుల రద్దీతో కిటికిటలాడిన తిరుమల నేడు కొంత రద్దీ తక్కువగానే ఉంది. అలాగని రద్దీ పూర్తిగా తగ్గలేదు. అలాగని ఎక్కువ సంఖ్యలో కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండకుండానే దర్శనం లభిస్తుంది. మే నెల దర్శన కోటా విడుదల వివరాలు విడుదల చేసింది.తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
మే నెల కోటా టిక్కెట్లను...
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ వెబ్ సైట్ ద్వారానే...
శ్రీవాణి దర్శన కోటా విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను కూడా విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా, ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరారు.
ఎనిమిది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారికి రెండు నుంచి మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,776 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,291 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.42 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.