తమిళనాడులో మరోసారి.. అదే ఘోరం

తమిళనాడులోని ఎన్నో ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ అనుమతితో పని చేస్తూ ఉంటే

Update: 2023-07-29 09:21 GMT

తమిళనాడులోని ఎన్నో ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ అనుమతితో పని చేస్తూ ఉంటే.. ఇంకొన్ని మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఉంటారు. బాణాసంచా తయారీ కేంద్రాలలో జరిగిన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనకు తెలుసు. కానీ అక్కడి పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. మరోసారి బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఏకంగా 8 మంది మరణించారు.

తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి భారీగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తెచ్చుందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 8 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ పేలుళ్లలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక, వైద్య సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండడంతో సమీపంలోని ఓ హోటల్ భవనం కూలిపోగా, మరో నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు మంటలను ఆర్పివేసి లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.


Tags:    

Similar News