Fake Trading App Scam: ఐటీ మేనేజర్ నుంచి ₹3.88 లక్షలు కాజేసిన ముఠా

వాట్సాప్‌ గ్రూప్‌లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులకు ప్రలోభం మోసంతో సంబంధమున్నట్లు అనుమానించి ఖాతాలోని ₹35 వేలపై ఫ్రీజ్

Update: 2026-03-05 13:40 GMT

హైదరాబాద్: నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ ద్వారా ₹3,88,000 మోసం జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన 43 ఏళ్ల ఐటీ మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు విల్సన్ సామ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 జూలైలో విల్సన్ సామ్‌ను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఆ గ్రూప్ మోతీలాల్ ఓస్వాల్ ట్రేడింగ్ సేవలతో సంబంధం ఉన్న గ్రూప్ అని, అధిక లాభాలు వస్తాయని చెప్పి ఓ ట్రేడింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారని ఆయన తెలిపారు.

గ్రూప్ సభ్యులు సూచించిన ఈక్విటీ పెట్టుబడులపై పెట్టుబడి పెట్టాలని చెప్పడంతో జూలై 14 నుంచి 17 మధ్య ఆయన తన ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం ₹3,88,000ను ఆ ప్లాట్‌ఫాం సంభందించిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిపారు.

మొదట యాప్‌లో ట్రేడింగ్ లాభాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తర్వాత ప్రతి రోజూ అదనంగా డబ్బు జమ చేయాలని గ్రూప్ ప్రతినిధులు ఒత్తిడి చేయడంతో అనుమానం వచ్చిందన్నారు.

అప్పటి నుంచి తాను మరింత పెట్టుబడి పెడతానని చెబుతూనే ప్రతి వారం కొద్దికొద్దిగా డబ్బు ఉపసంహరించుకోవడం ప్రారంభించానని పోలీసులకు వివరించారు.

ఇతర బాధితుల ఖాతాల నుంచి డబ్బు

కొంత సొమ్ము తన బ్యాంక్ ఖాతాలోకి తిరిగి జమ అయినట్లు సామ్ తెలిపారు. అయితే అవి నిజమైన ట్రేడింగ్ లాభాలు కాదని, ఇతర రాష్ట్రాల్లో మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన వ్యక్తుల ఖాతాల నుంచి వచ్చినవని తర్వాత తెలిసిందన్నారు.

తర్వాత యాప్‌లో కొత్త పెట్టుబడులు పెట్టడం, డబ్బు ఉపసంహరించుకోవడం రెండూ ఆగిపోయాయని తెలిపారు. అదే సమయంలో ఆన్‌లైన్‌లో ఇతర వినియోగదారుల ఫిర్యాదులు గమనించి ఆ ప్లాట్‌ఫాం మోసపూరితమని గ్రహించానన్నారు.

ఇదిలా ఉండగా రెండు నెలల తర్వాత తన బ్యాంక్ ఖాతాలోని ₹35,000ను మోసానికి సంబంధించిన డబ్బు అనుమానంతో చట్ట అమలు సంస్థలు ఫ్రీజ్ చేశాయని ఆయన పోలీసులకు తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు

మోసం జరిగిందని చూపేందుకు బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లావాదేవీ రికార్డులు, వాట్సాప్ సందేశాలను సామ్ పోలీసులకు సమర్పించారు. అనుమానితులు ఉపయోగించిన మొబైల్ నంబర్ల వివరాలూ అందజేశారు.

నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని, దర్యాప్తులో తాను బాధితుడినని నిర్ధారణ అయితే తన ఖాతాలో ఫ్రీజ్ చేసిన ₹35,000ను విడుదల చేయాలని పోలీసులను కోరారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News