నకిలీ ట్రేడింగ్ యాప్‌తో అడ్వకేట్‌కు ₹34.97 లక్షల మోసం

ఫేస్‌బుక్ ప్రకటనతో పరిచయం పలుమార్లు డబ్బు బదిలీ

Update: 2026-03-12 07:48 GMT

గాజులరామారం ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల అడ్వకేట్‌ను నకిలీ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా ₹34,97,014 మోసం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. ఫేస్‌బుక్‌లో కనిపించిన పెట్టుబడి ప్రకటనను నమ్మి ఈ మోసానికి గురైనట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.

ఫేస్‌బుక్ ప్రకటన....

ఫిర్యాదు ప్రకారం చి. శ్రీనివాస్‌రావు ఫిబ్రవరి 14, 2026న ఫేస్‌బుక్‌లో పెట్టుబడి కార్యక్రమం ప్రకటన చూసి ఆసక్తి చూపాడు. తర్వాత “AZ134-ABSL Impact Collective” పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చారు. అక్కడ దియా మెహ్రా అనే మహిళ తాను ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు సలహాదారినని పరిచయం చేసుకున్నట్లు తెలిపారు. సంస్థల తరహా ట్రేడింగ్‌ విధానాలపై సూచనలు ఇచ్చిందని, newealth-sys.net అనే వెబ్‌సైట్‌లో ఖాతా తెరవాలని చెప్పిందని బాధితుడు పేర్కొన్నాడు.

ఆమె ఇచ్చిన లాగిన్‌ వివరాలతో ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా తెరిచి గ్రూప్ సభ్యుల సూచనలతో ట్రేడింగ్‌ ప్రారంభించినట్లు తెలిపారు.

అపర్ సర్క్యూట్‌ షేర్లు

మొదట ఫిబ్రవరి 18, 2026న తన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతా నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాకు ₹1,99,014.16 పంపించినట్లు చెప్పారు. గ్రూప్ నిర్వాహకులు “అపర్ సర్క్యూట్‌” షేర్లు, బ్లాక్‌ ట్రేడ్లలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని, కమిషన్‌ ఉండదని చెప్పినట్లు వివరించారు.

తర్వాత ఫిబ్రవరి 22న ₹1,99,000, ₹50,000, ₹49,000 చొప్పున చెల్లించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 23న మరో ₹5,00,000 పంపినట్లు చెప్పారు. తరువాత కూడా పలు మార్లు డబ్బు జమ చేశానని పేర్కొన్నారు. ప్రతి సారి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు “చార్జ్ కోడ్‌” ఇచ్చి చెల్లింపులు చేయించారని చెప్పారు.

ఆ ప్లాట్‌ఫారమ్‌లో భారీ లాభాలు చూపించడంతో పాటు సాధారణ డీమాట్‌ ఖాతాల్లో లేని ట్రేడింగ్‌ అవకాశాలు కనిపించడంతో అది నిజమైన వ్యవస్థగా భావించానని బాధితుడు పోలీసులకు తెలిపాడు.

నకిలీ ఐపీవోతో మరింత డబ్బు

తర్వాత గ్రూప్ సభ్యులు “Acetech E-Commerce NSE SME QIB” పేరుతో ఉన్న ఐపీవోలో పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహించారని తెలిపారు. ప్లాట్‌ఫారమ్‌లో తనకు ₹13,00,18,48.20 విలువైన షేర్లు కేటాయించినట్లు చూపించారని చెప్పారు. మరింత డబ్బు పెట్టితే ₹77,81,034.67 లాభం వస్తుందని చూపించడంతో మరోసారి డబ్బు చెల్లించినట్లు తెలిపారు.

కానీ తరువాత ఉపసంహరణ సౌకర్యం నిలిపివేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. సంస్థ భారీ బైబ్యాక్‌లో పెట్టుబడి పెట్టిందని, మార్చి 9, 2026న తర్వాత ఉపసంహరణలు ప్రారంభమవుతాయని గ్రూప్ నిర్వాహకులు చెప్పినట్లు తెలిపారు.

మార్చి 9న డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించగా ముందుగా 20 శాతం కమిషన్‌ చెల్లించాలని ప్లాట్‌ఫారమ్‌ కోరిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఉపసంహరణ సదుపాయం పనిచేయలేదని చెప్పారు. వాట్సాప్‌ గ్రూప్‌ మ్యూట్‌ చేయడంతో పాటు నిర్వాహకులు స్పందించలేదని పేర్కొన్నారు.

నకిలీ యాప్‌, వెబ్‌సైట్‌....

తరువాత పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ నకిలీ అని, యాప్‌లో చూపిన లాభాలు కల్పితమని గుర్తించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ యాప్‌, వెబ్‌సైట్‌ సృష్టించి తన నుంచి ₹34,97,014.16 వసూలు చేసినట్లు ఆరోపించారు. ఇప్పటివరకు డబ్బు తిరిగి రాలేదని చెప్పారు.

ఈ వ్యవహారంలో దియా మెహ్రా, ప్రొఫ్‌. బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు వాట్సాప్‌ వినియోగదారుల పేర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ నిర్వాహకులు, సంబంధిత ఖాతాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Tags:    

Similar News