దీప్తిని చంపేసిన చందన.. ఒప్పేసుకుంది

జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు. దీప్తి సోదరి చందన

Update: 2023-09-02 10:24 GMT

జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు. దీప్తి సోదరి చందన ఆమె ప్రియుడు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. దీప్తి సోదరి చందనతో పాటు ఆమె ప్రియుడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో సోదరిపై మొదటి నుంచి అనుమానం ఉంది. అయితే హత్య జరిగిన రెండో రోజు తన అన్నకు ఫోన్ చేసిన చందన తనకు ఏ పాపం తెలియదని కన్నీరుమున్నీరైంది. దీంతో అసలు హంతకుడు ఎవరనే ఉత్కంఠ కొనసాగింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీప్తి మృతి చెందిన రోజే చెల్లెలు చందన కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. భీమునిదుబ్బ ప్రాంతంలో దంపతులు బంకా శ్రీనివాస్‌రెడ్డి, మాధవి నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఖాళీగా ఉంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. బంధువులు రావడంతో శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా పెద్దమ్మాయి దీప్తి ఫోన్ రిసీవ్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడగా దీప్తి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోఫాలో దీప్తి మృతదేహం పడి ఉండగా వంటగదిలో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా, ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి.
చందన కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్‌ బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డు అయింది. విచారణలో తానే తన అక్క దీప్తిని చంపినట్టు చందన ఒప్పుకుంది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, పైనుంచి చున్నీ కూడా చుట్టి గాలాడకుండా చేసి వెళ్లిపోయినట్టు చెల్లి చందన ఒప్పుకుంది. బాయ్ ఫ్రెండ్, అతడి తల్లి, మరో బంధువుతో పాటు కారు డ్రైవర్‌ కూడా ఇందులో భాగమైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న చందన.. సీనియర్ అయిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని వాళ్లింట్లో చెప్పటంతో.. మతాతంతర వివాహం కావడం వల్ల చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదని విచారణలో తెలిసింది.


Tags:    

Similar News