గద్దర్ అంతిమ యాత్రలో మీడియా ప్రముఖుడు మృతి

గద్దర్ అంతిమ యాత్ర లో విషాదం చోటు చేసుకుంది

Update: 2023-08-07 14:00 GMT

గద్దర్ అంతిమ యాత్ర లో విషాదం చోటు చేసుకుంది. గద్దర్ అంత్యక్రియల సమయంలో జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు. హార్ట్‌ స్ట్రోక్‌తోనే జహీరుద్దీన్ చనిపోయినట్టు సమాచారం.

సోమవారం సాయంత్రం అల్వాల్​లోని మహాబోధి స్కూల్లో గద్దర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.

సియాసత్ వార్తాసంస్థ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గద్దర్‌కు సన్నిహితుడుగా ఉండేవారని చెబుతున్నారు. గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. పడిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్‌ను స్థానికులు పక్కనే ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లుగా డాక్టర్ వెల్లడించారు. ఆదివారం (ఆగస్టు 6) ఉదయం జరిగిన విద్యావంతుల వేదిక సదస్సులో కూడా జహీరుద్దీన్ అలీ ఖాన్ చురుగ్గా పాల్గొన్నారు. గద్దర్ చనిపోయారని తెలుసుకున్న జహీర్ వెంటనే అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి నుంచి గద్దర్ అంత్యక్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన అంతిమయాత్ర వెంట కూడా ఆయన ఉన్నారు. అయితే మహాబోధి స్కూల్ ప్రాంగణం జనాలతో విపరీతంగా నిండిపోవడం, పోలీసులు ఎంత అదుపు చేయడానికి ప్రయత్నించినా తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఒత్తిడిలో జహీరుద్దీన్ అలీ ఖాన్ ఊపిరాడక సొమ్మసిల్లి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. అక్కడి వారు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయారు.

Tags:    

Similar News