Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మంది వరకూ ప్రయాణికులున్నారు. ఏలూరు జిల్లాలోని లింగంపాలెం మండల జూబ్లీ నగర్ లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
హైదరాబాద్ వస్తుండగా...
ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ లింగాపాలెం మండలం అయ్యపు రాజుగూడెంకు చెందిన యువకుడు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.