రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ దంత వైద్య విద్యార్థిని మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత, తునికి చెందిన పట్టూరి వాత్సల్య సాయి, విశాఖపట్నానికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో దంత వైద్యవిద్య పూర్తి చేసుకుని, ఇంటర్న్షిప్ చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం
వీరు రాజమండ్రి నుంచి రాజానగరం బయలుదేరి వెళుతున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారును రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం డీకొట్టింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న లిఖత అక్కడిక్కడే మరణించగా మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.