వైష్ణవి ఇక లేదు

బోయిన్ పల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి మరణించింది.

Update: 2023-08-03 07:32 GMT

బోయిన్ పల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి మరణించింది. సుచిత్ర రష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఆగస్టు 03న మృతి చెందింది. ఆగస్టు 02వ తేదీన తన తండ్రితో కలిసి బైక్ పై వెళ్తున్న వైష్ణవి, రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోగా స్కూటీ అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వైష్ణవిని ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఆమెను కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

అల్వాల్ లోని ఖానాజీగూడకు చెందిన విజయ్ కుమార్ ప్రతిరోజూ తన కుమార్తె వైష్ణవి(17)ని స్కూటీపై బోయిన్ పల్లి బస్టాప్​వద్ద డ్రాప్ చేస్తుండేవారు. ఆమె అక్కడి నుంచి బస్సులో కూకట్ పల్లిలోని డిగ్రీ కాలేజీకి వెళ్తుంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన విజయ్​కుమార్, బోయిన్ పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్ వద్ద మెయిన్ రోడ్ ఎత్తుగా ఉండటంతో కొద్దిదూరం రోడ్డు పక్క నుంచి వెళ్లాడు. మళ్లీ మెయిన్​ రోడ్ ఎక్కేందుకు ప్రయత్నించగా.. ముందు గుంత ఉండటంతో దాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డుపై స్కూటీ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. విజయ్ కుమార్ రోడ్డు పక్కకు, అతని కుమార్తె రోడ్డుపై పడిపోయారు. స్వల్పంగా గాయపడిన విజయ్​కుమార్ స్కూటీని పైకి లేపుతుండగా, సుచిత్ర సర్కిల్ నుంచి ఓవర్ స్పీడ్ తో వచ్చి డీసీఎం వైష్ణవిని ఢీకొట్టింది. పోలీసులు వైష్ణవిని 108లో దగ్గర్లోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. విజయ్ కుమార్ ఫిర్యాదుతో బోయిన్ పల్లి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News