అప్పుడు వైశాలి.. ఇప్పుడు శాలిని.. సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్

అందులో నుండి దిగిన యువకులు.. శాలినిని చుట్టుముట్టి కారులో తీసుకెళ్లిపోయారు. శాలిని వారి నుండి తప్పించుకునేందుకు ..

Update: 2022-12-20 06:11 GMT

shalini kidnap case

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఎవరు నిజం చెప్తున్నారో పోలీసులు నిగ్గు తేల్చే పనిలో ఉండగా.. వైశాలి కిడ్నాప్ మాదిరిగానే.. సిరిసిల్ల జిల్లాలో మరో యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని (18) అనే యువతి మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు హనుమాన్ దేవాలయానికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుండగా.. ఆలయం ముందుకి ఓ కారు వచ్చింది.

అందులో నుండి దిగిన యువకులు.. శాలినిని చుట్టుముట్టి కారులో తీసుకెళ్లిపోయారు. శాలిని వారి నుండి తప్పించుకునేందుకు తన సాయశక్తులా ప్రయత్నించింది. ఆమె తండ్రిని ఇద్దరు బంధించగా.. ఓ దుండగుడు ఆమెను వెంటాడి మరీ పట్టుకున్నాడు. యువతిని బలవంతంగా కారు ఎక్కించి.. అక్కడి నుండి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. తన కూతుర్ని కాపాడుకునేందుకు తండ్రి ప్రయత్నించినా.. ఫలించలేదు. కాగా.. శాలినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడే ఇదంతా చేసి ఉంటాడని భావిస్తున్నారు. శాలిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News