బోరు బావి మోటారు ఎత్తుతుండగా.. ముగ్గురు మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది

Update: 2023-09-23 05:39 GMT

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒకరు స్థానిక రైతు కాగా.. మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందిన వారిగా తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, గల్ల బాబీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రం సమీపంలో విద్యుత్ వైర్లకు ట్రాక్టర్ ట్రాలీ తగలడంతో డ్రైవర్ మృతిచెందాడు. ఎద్దుల చెరువుకట్ట ఓంశక్తి ఆలయం చిన్నూరు గ్రామానికి వెళ్లే రహదారిలో ట్రాక్టర్ సహాయంతో మట్టిని తరలిస్తూ, ఓబావిని పూడ్చడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడు. ట్రాక్టర్ హైడ్రాలిక్ ఆన్ చేసి ట్రాలీ వెనుక ఉన్న డోర్ తీయడానికి వెళ్లగా ట్రాలీ పైకి లేయడంతో పైనున్న విద్యుత్ వైర్లకు తగులుకొని షాక్ కొట్టింది. అతడు బావిలో పడి మృతిచెందాడు. పోలీసులు అగ్నిమాపకశాఖ సిబ్బంది సహకారంతో మృతదేహం కోసం కొన్ని గంటలపాటు శ్రమించి శవాన్ని బయటకు తీశారు. అనంతరం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు పలమనేరు రూరల్ టి.ఒడ్డూరు గ్రామానికి చెందిన రజనిగా గుర్తించారు.


Tags:    

Similar News