Murder Case : భర్తను ప్రియుడితో కలసి రాయితో కొట్టి చంపేసిన భార్య.. హైదరాబాద్ కు సమీపంలోనే?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భార్య తన ప్రియుడితో కలిసి భర్హను త్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డెయిరీ ఫామ్ లో పనిచేస్తున్న ఒక మహిళ మరో వ్యక్తితో కలసి తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అజీజ్ నగర్ కు చెందిన రాజిరెడ్డి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్ ను ప్రారంభించారు. అందులో పనిచేసేందుకు మనుషులు కావాలని బీహార్ కు చెందిన ఏజెంట్ పవన్ ను సంప్రదించాడు. అతని ద్వారా దాదాపు నెల రోజుల క్రితం పూనమ్, రాజేశ్ కుమార్ దంపతులు ఫామ్ హౌస్ లో పనిచేసేందుకు వచ్చారు.
కొత్త వ్యక్తి కనిపించడంతో...
అయితే రెండు రోజుల క్రితం రాజిరెడ్డి తన డెయిరీ ఫామ్ వద్దకు రాగా కొత్త వ్యక్తి కనిపించాడు. ఎవరని ఆరా తీయడంతో అతను తమ బంధువు అని చెప్పడంతో మౌనంగా ఉన్నాడు. అయితే శుక్రవారం మరోసారి రాజిరెడ్డి తన ఫామ్ హౌస్ కు వెళ్లగా రాజేశ్ కుమార్ కనిపించలేదు. పూనమ్ ఒక్కతే ఉంది. అనుమానం వచ్చిన రాజిరెడ్డి రాజేశ్ ఎక్కడకు వెళ్లాడని ప్రశ్నించగా, తాగి తనతో ఘర్షణ పడి ఎక్కడికో వెళ్లిపోయాడని, మళ్లీ వస్తాడని చెప్పడంతో రాజిరెడ్డి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు సాయంత్రం వచ్చిన రాజిరెడ్డికి డెయిరీ ఫామ్ వద్ద ఎవరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే వారికి ఫోన్ చేశారు. కానీ ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
అనుమానం వచ్చి...
ఫోన్ స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి తనకు పనికి కుదిర్చిన ఏజెంట్ పవన్ కు ఫోన్ చేసి దంపతులు ఇద్దరూ కనిపించడం లేదని చెప్పడంతో పవన్ తాను కనుక్కుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే కొద్దిసేపటి తర్వాత పవన్ ఫోన్ చేసి రాజేశ్ కుమార్ ను హత్య చేసి పూనమ్, మహేశ్ అనే వ్యక్తి మృతదేహాన్ని బావివద్ద పడేశారని చెప్పడంతో రాజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజిరెడ్డి బావి వద్దకు వెళ్లి చూస్తే రాజేశ్ కుమార్ మృతదేహం కనిపించింది. పోలీసులు వచ్చి రాజేశ్ కుమార్ తలపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.