స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన బాలుడు
గురుగ్రామ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది
గురుగ్రామ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పదిహేడేళ్ల విద్యార్థి తన తండ్రి వద్ద ఉన్న లైసెన్సు తుపాకీతో స్నేహితుడిని కాల్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరు మైనర్ విద్యార్థులను పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 8వ తేదీ రాత్రి సెక్టర్–48లోని ఓ ఫ్లాట్లో బాలుడిపై కాల్పులు జరిగాయని కంట్రోల్రూమ్ నుంచి సమాచారం అందడంతో సదర్ పోలీస్స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థిని కుటుంబసభ్యులు మెడాంటా ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఘటనాస్థలానికి ఎఫ్ఎస్ఎల్, ఫింగర్ప్రింట్ బృందాలను కూడా పిలిపించారు.
తండ్రి గన్ తో....
పరిశీలనలో గదిలోని పెట్టె నుంచి ఒక తుపాకీ, రెండు మాగజైన్లు, ఐదు సజీవ కార్ట్రిడ్జీలు, ఒక వాడిన కార్ట్రిడ్జ్ కేసు, 65 బుల్లెట్లు ఉన్న మరో మాగజైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 8వ తేదీన ఆమె కుమారుడిని ఒక స్నేహితుడు కలవాలని పిలిచాడని, తొలుత నిరాకరించినా తర్వాత ఖేర్కి దౌలా టోల్ప్లాజా వద్ద కలిసేందుకు వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత ఆ బాలుడు మరో స్నేహితుడితో కలిసి సెక్టర్–48లోని అద్దె ఫ్లాట్కు తీసుకెళ్లి కాల్చాడని బాధితుడి తల్లి ఆరోపించారు. రెండు నెలల క్రితం ఇద్దరి మధ్య తగవు జరిగినట్లు ఆమె తెలిపింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.