Goa Accidnet : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం ..23 మంది మృతి
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది మరణించారు
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది మరణించారు. అగ్నిప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణమని పోలీసులు తెలిపారు. ఉత్తర గోవా అర్పోరా గ్రామంలోని ప్రముఖ నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో 23 మంది మృతి చెందారు. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది కిచెన్ సిబ్బందే. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. మృతుల్లో ముగ్గురు పర్యాటకులుగా అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు ఎక్కువగా ఉన్న గోవా ప్రాంతంలో అగ్నిప్రమాదంలో 23 మంది మరణించడం సంచలనంగా మారింది.
సిలిండర్ పేలడంతో...
ఘటనాస్థలానికి వెళ్లిన ఆయన, 23 మందిలో ముగ్గురు కాలిన గాయాలతో, మిగిలిన వారు పొగతో ఊపిరి ఆడక మృతిచెందినట్లు వివరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ నైట్క్లబ్ అగ్ని మాపక నిబంధనలు పాటించలేదని సీఎం ప్రమోద్ సావంత్తెలిపారు. ‘బిర్చ్ బై రోమియో లేన్’ పేరుతో గత ఏడాది ప్రారంభమైన ఈ పార్టీ వేదిక పణజి నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అర్ధరాత్రి తర్వాతే మంటలు చెలరేగాయని పోలీసులు పేర్కొన్నారు. సేఫ్టీ నిబంధనలు పట్టించుకోకుండా ఆపరేట్ చేసేలా అనుమతిచ్చిన క్లబ్ మేనేజ్మెంట్ పై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సావంత్ చెప్పారు. నిబంధనలు పాటించని క్లబ్ పై చర్యలు తీసుకుంటామన్నారు.
పర్యాటక ప్రాంతంలో...
పర్యాటక సీజన్ పీక్స్లో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని ముఖ్యమంత్రి సావంత్ పేర్కన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గోవా పోలీసు చీఫ్ అలోక్ కుమార్ కూడా సిలిండర్ పేలుడే కారణమని తెలిపారు. మొత్తం 23 మృతదేహాలను బయటకు తీశామని, వాటిని బంబోలిం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించామని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారని లోబో చెప్పారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.