Telangana : మహిళపై సామూహిక అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

అచేతన స్థితిలో ఉన్న బాధితురాలిని చూసిన వ్యక్తి.. వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం ..

Update: 2022-09-26 03:51 GMT

యువతులు, మహిళలపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తెలంగాణలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ శివారు డిడిగి గ్రామ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో వివాహితపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 24, శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వివాహితను ఆటోలో జహారాబాద్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. శనివారం ఉదయం అచేతన స్థితిలో ఉన్న బాధితురాలిని చూసిన వ్యక్తి.. వెంటనే జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. బాధితురాలిని సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. కాగా.. సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆటో ఎక్కిన మహిళకు మత్తుమందిచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags:    

Similar News