తాను వెళ్లిపోతే బిడ్డలేమైపోతారో.. తల్లి దారుణ నిర్ణయం

చేతికి అందివచ్చిన బిడ్డలతో సహా ఓ తల్లి అఘాయిత్యానికి పాల్పడింది. ఇంతకీ వారి ఆత్మహత్యాయత్నానికి కారణమేంటి?

Update: 2022-05-05 10:29 GMT

ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో కానీ గుండెను రాయి చేసుకుంది. తాను లేకపోతే తన బిడ్డలు అన్యాయమైపోతారని భావించి దారుణ నిర్ణయం తీసుకుంది. చేతికందొచ్చిన ముగ్గురు బిడ్డలతో సహా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తల్లితో సహా చిన్న కూతురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద కుమార్తె, కొడుకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

జలమూరు మండలం యలమంచిలికి చెందిన చింతు చిన్నమ్మడు(46) నరసింహులు దంపతులకు ముగ్గురు పిల్లలు రంజని(20), జాహ్నవి(17), శశాంక్(14) ఉన్నారు. ఈరోజు ఉదయం అనూహ్యంగా తల్లి, ముగ్గురు బిడ్డలతో సహా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటల్లో కాలిపోయి తల్లి చిన్నమ్మడు, చిన్న కూతురు జాహ్నవి మృతి చెందారు. పెద్ద కూతురు రంజని, కొడుక శశాంక్‌‌కి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. భర్త నరసింహులును ఆరా తీస్తున్నారు. కొద్దికాలంగా భూమి విషయమై వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే విషయమై మనస్థాపానికి గురైన చిన్నమ్మడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసు విచారణలో అసలు నిజాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News