అనంత బాబు అరెస్ట్‌ పై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

Update: 2022-05-23 16:53 GMT

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు.

అనంత బాబు అరెస్ట్‌ అనంతరం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాకు వెల్లడించారు. సుబ్రహ్మణ్యం హత్యపై కీలక వివరాలు వెల్లడించారు ఎస్పీ. కేసు విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబును నిందితుడిగా గుర్తించామన్నారు. ఈ నెల 19న సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అనంతబాబు తెలిపారన్నారు. శ్రీరామ్‎నగర్ శంకర్ టవర్ వద్ద అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య ఘర్షణ జరిగిందని.. తోపులాటలో ఐరన్ రాడ్ తగిలి సుబ్రహ్మణ్యంకు బలమైన గాయమైందన్నారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో సుబ్రహ్మణ్యం శ్వాస ఆగిపోయిందని చెప్పారు. సుబ్రహ్మణ్యం మృతి చెందటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనంతబాబు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని ఎస్పీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు గుర్తించాలంటే.. బాడిలో అన్ని చోట్ల గాయాలు ఉండేలా సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు కర్రతో కొట్టినట్లు ఎస్పీ రవీంద్ర బాబు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు అనంతబాబును అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలిస్తున్నామని తెలిపారు.
జీజీహెచ్‎లో ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు పూర్తి చేసి.. పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.


Similar News