Chandrababu : నేడు విజయనగరం జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే హెచ్.పి.వి వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.10 గంటలకు చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. 11.30 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకుంటారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.
పింఛన్ల పంపిణీకి...
అనంతరం 12 గంటలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావివలసలో పాల్గొంటారు. తర్వాత ఏపీలో చేపట్టనున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.50 గంటలకు రావివలసలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పేదలకు పింఛన్ల పంపిణీ చేస్తారు. అనంతరం 03.15 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. జిల్లా పర్యటన అనంతరం రాత్రి 7.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.