Ambedkar : నేడు బెజవాడలో దేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు

Update: 2024-01-19 02:26 GMT

విజయవాడ ఈరోజు మహత్తర ఘట్టానికి వేదిక కానుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించినా ప్రజలకు మాత్రం స్మృతి వనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి అనుమతివ్వనున్నారు.

మూడేళ్ల శ్రమ...
మూడేళ్ల నుంచి ఈ విగ్రహ నిర్మాణం జరుగుతుంది. ఈ విగ్రహ నిర్మాణానికి 404.35 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం అందుకు విజయవాడ నడిబొడ్డులో ఉన్న స్వరాజ్ మైదానం అయితే బెటర్ అని భావించి చర్యలు చేపట్టింది. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. దేశంలోనే అత్యంత పెద్దదైన అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేపట్టి నేడు జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
విగ్రహం ఎత్తు...
ఈ విగ్రహం మొత్తం 206 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇందులో బేస్ ను 81 అడుగుల ఎత్తులో నిర్మించారు. విగ్రహాన్ని 125 అడుగులలో రూపొందించారు. అంబేద్కర్ స్మృతి వనంలో పచ్చని చెట్లతో పాటు రాత్రి వేళ విద్యుత్తు దీపాల కాంతులతో జిగేల్ మనిపించేలా లైట్లను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవిత గాధతో పాటు స్పూర్తినిచ్చే రచనలు, వివిధ పుస్తకాలతో కూడిన లైబ్రరీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే వివిధ చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. చారిత్రాత్మకమైన ఈ విగ్రహావిష్కరణ సాయంత్రం నాలుగున్నర గంటలకు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
అంబేద్కర్ విగ్రహావిష్కరణను వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. స్వరాజ్ మైదానం వద్దకు కేవలం వీఐపీ వాహనాలనే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలను ఈరోజు విజయవాడలో దారి మళ్లిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. విగ్రహావిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడలో అతి పెద్ద టూరిజం ప్లేస్ గా స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ స్మృతివనం మారనుంది.


Tags:    

Similar News