Andhra Pradesh : పెమ్మసానికి సవాల్ విసిరిన అంబటి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై కేసు నమోదయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. తనపై నమోదయిన అక్రమ కేసులు, తన ఇంటిపై జరిగిన దాడి విషయాన్ని జగన్ కు వివరించారు. నిన్న బెయిల్ పై విడుదలయిన అంబటి రాంబాబు జగన్ వద్ద జరిగిన విషయాలను తెలిపారు. అయితే అక్రమ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని అంబటికి జగన్ భరోసా ఇచ్చారు. కొందరు అధికార పార్టీకి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిని కూడా వదిలి పెట్టేది లేదని తెలిపారు.
కమ్మ సామాజికవర్గాన్ని దూషించానని...
తర్వాత అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వాహనంపై దాడికి దిగినందుకు తాను అన్న మాటలకు క్షమాపణలు చెప్పానని, అయినా తాను చంద్రబాబును దూషించలేదని, అయినా తన ఇంటిపై దాడి గంటల పాటు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. తాను కమ్మ సామాజికవర్గాన్ని పేరు పెట్టి దూషించానని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాను అనని మాటలను అన్నట్లు రిమాండ్ రిపోర్టులో సీఐ పేర్కొనడాన్ని అంబటి రాంబాబు తెలిపారు. తనకు సినిమాను చూపించి మీరు విలన్లయ్యారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సవాల్ విసిరారు. అసలు హీరో ఎవరో ఆలోచించుకోవాలన్నారు. అన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు.