కర్ణిసేన కిష్కింధ కాండ....!

Update: 2018-01-25 02:30 GMT

సినిమా చూశాం.... అభ్యంతరాలు లేవని ఢిల్లీ లో కొందరు ఉద్యమకారులు ప్రకటన చేసి 24 గంటలు తిరక్కుండా కర్ణిసేన ఉత్తరాదిలో పాలు రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, వాహనాలు ఒకటేమిటి అన్ని కర్ణిసేన గూండాయిజానికి నాశనం అయిపోతున్నాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లలో ఈ దాడులు తీవ్రం అయ్యాయి. జాతీయ రహదారులు దిగ్బంధించి వచ్చి పోయే వాహనాలపై రాళ్ళు రువ్వుతూ కర్ణిసేన కిష్కింధ కాండ మొదలెట్టేసింది.

చోద్యం చూస్తున్న బిజెపి పాలిత ప్రభుత్వాలు ....

సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం భేఖాతర్ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను వెక్కిరిస్తూ సాగుతున్న దమనకాండపై ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అడ్డుకోవడం మాని చేష్టలుడిగి చూస్తున్నాయి. దీనిపై పెద్దఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నా కేంద్ర ప్రభుత్వం సైతం బిజెపి పాలిత రాష్ట్రాలను హెచ్చరించకపోవడం విడ్డురమని సోషల్ మీడియా లో నెటిజెన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా బిజెపిపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. కర్ణిసేనకు బిజెపి ప్రభుత్వాలు చేతులు కట్టేయడం ఏమిటని వారి గూండాయిజానికి సామాన్యులు బలైపోతున్న స్పందించి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అంతా నిలదీస్తున్నారు.

ఘాటుగా స్పందించిన క్రేజీవాల్ ....

ఉత్తరాదిన ఒక సినిమా విషయంలో ఇంత బీభత్సం సాగుతున్నా ప్రభుత్వ మౌనం వహించడం పై ఆప్ ఢిల్లీ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుండా గిరి చేస్తున్న వారిని కంట్రోల్ చేయలేకపోతే విదేశీ పెట్టుబడులు దేశంలో ఎవరు పెట్టేందుకు ముందుకు వస్తారని ప్రశ్నలు వేశారు కేజ్రీవాల్. ఇక ముంబాయిలో పద్మావత్ విడుదల సందర్భంగా భారీ భద్రతను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం కర్ణిసేన అరాచాకాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నేడు విడుదల అవుతున్న సంజయ్ బన్సాలి చిత్రంపై మరోవైపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Similar News