చిన్నమ్మ స్కెచ్.. వారిపైనేనట

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కాక మీద ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్టాలిన్ అందరి మన్ననలను పొందుతూ పాలన సాగిస్తున్నారు. కానీ పదేళ్ల [more]

Update: 2021-07-13 16:30 GMT

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కాక మీద ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్టాలిన్ అందరి మన్ననలను పొందుతూ పాలన సాగిస్తున్నారు. కానీ పదేళ్ల పాటు మొన్నటి వరకూ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఆ పార్టీ చిన్నమ్మ శశికళతో చిక్కులు ఎదుర్కొంటోంది. మొన్న జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయినా అన్నాడీఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో మంచి విజయాన్నే సాధించింది. అధికారంలోకి రాకపోయినా, పదేళ్ల పాటు అధికారంలో ఉన్న అసంతృప్తి ఉన్నా పనితీరును బాగానే చూపింది. దీనికి పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను మెచ్చుకోకుండా ఉండలేం.

రాజకీయాల నుంచి..

అయితే జైలు నుంచి విడుదలయిన శశికళ ఎన్నికలకు ముందు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆమె పార్టీ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలతో ఆమె తరచూ మాట్లాడుతున్నారు. శశకళతో మాట్లాడిన నేతలపై అన్నాడీఎంకే వేటు వేసినా కొందరు ఇప్పటికీ శశికళతో టచ్ లోఉన్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని నేతలు, పళనిస్వామి, పన్నీర్ సెల్వంలపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు శశికళ వైపు చూస్తున్నారు. శశికళ పార్టీని టేకోవర్ చేయాలన్న డిమాండ్ విన్పిస్తుంది.

ససేమిరా అంటుండటంతో…

అయితే పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు మాత్రం శశికళను తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు అంగీకరించడం లేదు. కానీ పార్టీలో మాత్రం సింహభాగం శశికళ రాకనే కోరుకుంటున్నారు. ఆర్థికంగా బలమైన శశికళ వస్తేనే పార్టీ ఈసారైనా అధికారంలోకి వస్తుందన్నది ఎక్కువ మంది నేతల విశ్వాసం. శశికళ చరిష్మా కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు. పన్నీర్, పళనిస్వామిలను ఒప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు కొందరితో టీటీవీ దినకరన్ సమావేశమయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్యేలే టార్గెట్……

ఎమ్మెల్యేలను తొలుత తమకు అనుకూలంగా మలచుకుంటే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీక్ అవుతారన్నది శశికళ ప్లాన్ గా ఉంది. అందుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన గూటికి రప్పించుకుని, పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా తప్పించేందుకు శశికళ స్కెచ్ రెడీ చేశారంటున్నారు. కరోనా తగ్గి పరిస్థితులు కుదుట పడిన వెంటనే గేమ్ స్టార్ట్ చేయాలని యోచిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమను దాటిపోకుండా చూసుకోవడం ఇప్పుడు పళనిస్వామికి సవాల్ గా మారింది. మొత్తం మీద తమిళనాడు అన్నాడీఎంకేలో రానున్న రోజుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News