పాలిటిక్స్ కు ప్యాకప్ చెప్పేసినట్లే

ఆయన మాజీ ఎంపీ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు, తెలుగు సినీ తెరపై కొన్ని దశాబ్దాల పాటు హీరోగా, క్యారెక్టర్‌ ఆరిస్టుగా చక్రం తిప్పారు. అటు [more]

Update: 2019-08-10 15:30 GMT

ఆయన మాజీ ఎంపీ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు, తెలుగు సినీ తెరపై కొన్ని దశాబ్దాల పాటు హీరోగా, క్యారెక్టర్‌ ఆరిస్టుగా చక్రం తిప్పారు. అటు రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాన్ని కూడా ఏలారు. ఇప్పటికీ ఆయా వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కోడలిని సైతం రంగంలోకి దింపారు. అయితే, ఆమె ఓడిపోయింది. ఆ కుటుంబమే త్వరలో రాజకీయల నుంచి తప్పుకొనేందుకు నిర్ణయించుకుందని రాజకీయ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరంటే.. మాగంటి మురళీ మోహన్‌. వెండితెరపై వందల చిత్రాల్లో నటించిన మురళీ మోహన్‌ ఆది నుంచి కూడా అన్నగారు ఎన్టీఆర్‌ హయాం నుంచి టీడీపీకి మద్దతుగా నిలిచారు.

తొలి నుంచి టీడీపీలో….

ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా మాగంటి మురళీమోహన్ ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే 2009 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు.అయితే, అప్పటి ఎన్నికల్లో వైఎస్‌ హవా సహా ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హవాల నేపథ్యంలో ఆయన ఓటమిపాలయ్యారు. అయితే, పట్టువదలని విక్రమార్కుడిగా ఇక్కడ నుంచి గెలిచి తీరాలని నిర్ణయించుకున్న మురళీ మోహన్‌ 2014లో మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. అంత‌కు ముందు ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఐదేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిర‌గ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ఆయ‌న్ను ఏకంగా 1.57 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు.

కోడలిని రంగంలోకి దించినా…

అయితే, ఆయన ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. అదే సమయంలో ఇసుక మాఫియాకు సహకరించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక, 2019 ఎన్నికల సమయానికి ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ వారసురాలిగా కోడలు మాగంటి రూపాదేవిని రంగంలోకి దింపారు. ఆమె నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరిగింది. ప్రతి ఒక్కరినీ కలుసుకుని ముందుకు సాగింది. అయితే, గతంలో మాగంటి మురళీమోహన్ ప్రజలను పట్టించుకోని ప్రభావం ఆమెపై పడింది. మరోపక్క, వైసీపీ అధినేత జగన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రజలు మార్పు కోరుకున్నారు. దీంతో రూపాదేవి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌పై దాదాపు 1.2 లక్షల ఓట్లతేడాతో ఓడిపోయారు.

చంద్రబాబు చెప్పినా….

ఇక, ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. మరోపక్క, చంద్రబాబు కూడా సహకరించేందుకు రెడీ అయ్యారు. ముర‌ళీ మోహ‌న్ ఫ్యామిలీ రూప‌కు ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తుంద‌న్న సందేహాలు అటు పార్టీకి, ఇటు స్థానిక కార్యక‌ర్తల‌కు కూడా ఉన్నాయి. ఇటీవ‌ల ముర‌ళీమోహ‌న్ కాలికి శ‌స్త్రచికిత్స చేసుకున్నప్పుడు ప‌రామ‌ర్శకు వెళ్లిన చంద్రబాబు రూపాదేవి పార్టీ కార్యక‌లాపాల్లో కంటిన్యూ అవుతుంద‌ని… ఆమెకు మీరు బ్రేక్ వేయ‌వ‌ద్దని కూడా చెప్పార‌ట‌.

రాజకీయాలు వద్దంటూ….

ఇటు రూపాదేవి కూడా ఓడిపోయాక ఇప్పటికే ఐదారు సార్లు రాజ‌మ‌హేంద్రవ‌రంలో ప‌ర్యటించి కార్యక‌ర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. అయితే, ఎన్నికలకు చాలా సమయం ఉండడం, మరోపక్క, మురళీ మోహన్‌ అనారోగ్యంతో ఉండడంతో ఇప్పుడు వ్యాపారాలే కీలకమని భావించారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు స్వస్థిపలకాలని, వ్యాపారాల్లోనే నిమగ్నం కావాలని కోడలికి సూచించినట్టు ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. మాగంటి ముర‌ళీ మోహ‌న్ ఫ్యామిలీలో కీల‌క వ్యక్తులు రూప‌ను రాజ‌కీయాల్లో కొన‌సాగించేందుకు ఇష్టప‌డ‌డం లేద‌ట‌. రాజ‌కీయాలు, వ్యాపారాలు రెండు ప‌డ‌వుల‌పై కాళ్లు వేస్తే అన్ని విధాలా దెబ్బతింటామ‌న్న ఉద్దేశంతో వారు రాజ‌కీయాల‌కు దూరం కావాల‌ని నిర్ణయించుకున్నట్టు టాక్‌. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News