Andhra : బద్నాం చేయడమెలా…. పి.హెచ్.డి. చేసినట్లుందే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితని చూస్తుంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏ స్ట్రాటజీని ప్రయోగించారో అదే వ్యూహాన్ని ఇప్పుడు [more]

Update: 2021-10-12 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితని చూస్తుంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఏ స్ట్రాటజీని ప్రయోగించారో అదే వ్యూహాన్ని ఇప్పుడు చంద్రబాబు అమలు పరుస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలి. అందుకు అవతలి వారిని బద్నాం చేయాలి. అందులో నిజముందా? లేదా? అన్నది వారికి అనవసరం. వారికి కావాల్సిందల్లా అధికార పార్టీ నేతలపై నెగిటివ్ అంశాలను జనాల మైండ్ లోకి జొప్పించడమే.

నాడు టీడీపీపై….

2014లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. వాటిలో ఏ ఒక్కటీ ఇప్పుడు కూడా రుజువు చేయలేకపోయింది. ఎర్ర చందనాన్ని హెరిటేజ్ వాహనాల్లో తరలిస్తూ టీడీపీ నేతలు అక్రమార్జనకు పాల్పడుతున్నారని వైసీపీ గతంలో ఆరోపించింది. ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారని విమర్శించింది. ఇక తిరుపతిలో శ్రీవారి పింక్ డైమండ్ మాయమయిందని కూడా ఆరోపించింది.

ఆరోపణల్లో నిజం లేదని….

తిరుమల శ్రీవారి చెంత ఉండాల్సిన పింక్ డైమండ్ హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటిలో ఉందని అప్పట్లో విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలే చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పింక్ డైమండ్ లేదు. ఎర్ర చందనం లేదు. అప్పటి ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు కూడా అదే రూట్లో వెళుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీపై బురద చల్లే కార్యక్రమం మొదలు పెట్టారు.

ఇప్పుడు వైసీపీపై….

గుజరాత్ లో పట్టుపడిన హెరాయిన్ కు ఏపీ వైసీపీ నేతలకు ముడిపెడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో విజయసాయిరెడ్డికి వాటా ఉందని, ఆయన కుమారుడికి ఏపీలోని కొన్ని పోర్టులలో వాటాలున్నాయని కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఇక మద్యం బాటిళ్ల లో కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తుంది. ఏతా వాతా తేలేదేమిటంటే చంద్రబాబు, జగన్ ఇరువురు చేస్తున్న ఆరోపణలు రాజకీయమైనవే. కేవలం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రెండు పార్టీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి.

Tags:    

Similar News