ఉద్యమ సమయంలో ఎలా ఉన్నా... రాష్ట్రం విడిపోయాక అందరం ఒక్కటే అంటున్నారు లగడపాటి రాజగోపాల్. ఆయన తెలంగాణ ఉద్యమసమయంలో యాగీ యాగీ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తిడితే.. అంతకు రెండింతలు తిట్టడంలో లగడపాటి సిద్ధహస్తుడు. కేసీఆర్ ను తిట్టితిట్టీ ఆయన ఫ్యాన్స్ ను బాగానే సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన లగడపాటి చెప్పిన విధంగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రులను, మంత్రులను తరచూ కలిసే లగడపాటి తాజాగా తెలంగాణ మంత్రులను, ఎమ్మెల్యేలను కలిశారు.
కేసీఆర్ ను కలిసిన లగడపాటి....
గురువారం తెలంగాణ శాసనమండలి, శాసనసభకు వచ్చి తన కుమారుడి ఆహ్వాన పత్రికను అందించారు. అందరూ పెళ్లికి రావాలని కోరారు. అలాగే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిశారు లగడపాటి. లగడపాటిని కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఉద్యమ నేపథ్యంలో ఒకరికొకరు తిట్టిపోసుకున్నా రాష్ట్రం విడిపోయినా తామంతా ఒక్కేటేనని చెబుతున్నారు ఈఆంధ్ర ఆక్టోపస్.