వాహ్వా...మెట్రో... అపూర్వ స్పందన

Update: 2017-11-30 02:21 GMT

హైదరాబాద్ లో మెట్రో రైలుకు తొలిరోజే అపూర్వ స్పందన కన్పించింది. ఆకాశమార్గంలో వెళ్లే రైలులో ప్రయాణించాలని హైదరాబాదీలు క్యూ కట్టారు. స్టేషన్ల నిండా జనమే. ప్రధాని మోడీ మెట్రో ప్రారంభించిన తర్వాత నిన్న టి నుంచి మెట్రో రైలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. తొలిరోజే దాదాపు లక్ష మంది జనం ప్రయాణించారని, ఇది ఊహించనిదని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే వీరిలో కొందరు మెట్రో రైలు ఎక్కేందుకే వచ్చారన్న వాదనలో అర్ధం లేదన్నారు. మొత్తం మంది ప్రయాణికుల్లో 20 శాతం మంది మాత్రమే మెట్రో అనుభూతిని పొందేందుకు వచ్చారని, మిగిలిన వారంతా ఉద్యోగులు, వ్యాపారులేనన్నది తేలిందన్నారు. మెట్రోకు ఇదే స్పందన లభిస్తే విజయం సాధించినట్లేనని అభిప్రాయపడ్డారు. కాగా మెట్రో రైలు తొలిరోజు ఎక్కేందుకు జనం పోటీ పడ్డారు. సెల్ఫీలు దిగారు. ఛార్జీలు పెద్దగా లేవని ప్రజలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద తొలిరోజు మెట్రోకు ఊహించని స్పందనే లభించింది.

Similar News