బెజవాడలో బ్యారేజీ ఎగువన మరో బ్యారేజీ
By - Telugu Post
Update: 2017-02-09 08:30 GMT
ఏపీ నూతన రాజధాని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువున 5 టిఎంసిల నిల్వ సామర్ధ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీకి ఎగువున వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించాలని రాష్ట్ర విభజనకు ముందు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వెలగపూడిలో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో బ్యారేజీ నిర్మాణం ఎక్కడ జరుగుతుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. 2050 నాటికి రాజధానిలో ప్రజల నీటి అవసరాలకు 8 టిఎంసిల నీరు అవసరమని లెక్కించారు.
నిర్మాణ స్థలంపై సర్వే...
ప్రకాశం బ్యారేజీ నిల్వ సామర్ధ్యం 3 టిఎంసిలు మాత్రమే. అందులో సగానికిపైగా ఇసుకతో నిండిపోయి ఉంది. డ్రెడ్జింగ్ ద్వారా బ్యారేజీలో పూర్తి స్థాయి నీటిని అందుబాటులోకి తెచ్చినా అవి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చలేవు. ఈ నేపథ్యంలో మరో బ్యారేజీ ఐదు టిఎంసిల సామర్ధ్యంతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖను ఆదేశించారు. ఈమేరకు అధికారులు కొత్త బ్యారేజీ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించే పనిలోపడ్డారు.