‍Narendra Modi : కుటుంబ పార్టీలకు మద్దతివ్వకండి.. అభివృద్ధికే మీ ఓటు వేయండి

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Update: 2024-05-08 05:31 GMT

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ అవినీతిలో తోడు దొంగలేనని అన్నారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నాడు విచారణ జరపలేదన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఇంతవరకూ ఎందుకు విచారణ జరపలేదని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పీవీ నరసింహారావు పార్ధీవదేహాన్ని కూడా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లకుండా అవమానపర్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ తాము పీవీని భారతరత్న అవార్డుతో సత్కరించామని తెలిపారు.

ఎన్నికల ప్రకటన రాగానే...
గత పదేళ్లుగా తన పనితీరును మీరు చూశారన్నారు. భారత్ అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకు వెళుతుందన్నారు. మనదేశంలో ఎంత సమర్థత ఉన్నా దానిని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే దక్కుతుందన్నారు. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభను నిర్వహించడం తనకు గుజరాత్ లో కూడా సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదన్నారు. యువరాజు అదానీ, అంబానీ అంటూ తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రకటన రాగానే అదానీ, అంబానీ గురించి మాట్లాడటం లేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
రెండు పార్టీలూ ఒకటే...
బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఫ్యామిలీ ఫస్ట్ అని అన్నారు. రెండు పార్టీలూ ఒకటేనని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదన్నారు. ఇక్కడ డబుల్ ఆర్ కలెక్షన్లు నడుస్తున్నాయన్నారు. ఇక్కడ వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారన్నారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్నారు. ఆ రెండు పార్టీలూ ఎంఐఎంకు హైదరాబాద్ ను లీజుకు ఇస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో తొలిసారి బీజేపీ పోటీ ఇస్తుందని భావించి రెండు పార్టీలూ కలసి రెండు పార్టీలూ ఎంఐఎంను గెలిపించడానికి కృషి చేస్తున్నాయన్నారు.
Tags:    

Similar News