తన కూతురి జీవితాలతో అల్లుడు ఆడుకుంటున్నాడంటూ ఓ మహిళ ధర్నాకు దిగింది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న తన అల్లుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అసలేం జరిగింది? ఎవరతను? ఆమె ఆరోపణల్లో నిజమేంటి? జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఆమె పేరు ధనలక్ష్మి. గుంటూరు జిల్లావాసి. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతుర్ని ఏడేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన పెద్దారెడ్డికి ఇచ్చి పెళ్లి చేసింది. పెద్దారెడ్డి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నాడు. పెళ్లైనప్పటి నుంచి తన కూతుర్ని అల్లుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తోంది ధనలక్ష్మి. అతని వేధింపులకు భయపడి దూరంగా ఉంటున్నా వదలట్లేదని ఆరోపిస్తోంది. తనతో పాటు తన ముగ్గురు కూతుళ్లను కాల్గాళ్స్గా చిత్రీకరిస్తూ... వాట్సప్, ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. తన అల్లుడు పెద్దారెడ్డి వేధింపుల గురించి ఏపీ, తెలంగాణ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటోంది ధనలక్ష్మి. రోజురోజుకీ వేధింపులు పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాధితురాలు... తన అల్లుడు విధులు నిర్వహించే ఎల్బీనగర్లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది.