ఫైనల్ డెసిషన్ పెద్దాయనదేనట

ముద్రగడ పద్మనాభంకు ఏపీలో ఎవరికీ లేనంత వాల్యూ పెరిగింది ఆయన ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీకి హైప్ వస్తుందని నమ్ముతున్నారు.

Update: 2022-12-01 06:32 GMT

ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో యాక్టివ్ గా వ్యవహరిస్తారా? గత ఎన్నికలకు దూరంగా ఉన్న ముద్రగడ ఈసారి మాత్రం ప్రత్యర్థులను గడగడలాడించేందుకు రెడీ అయిపోయారా? అంటే అవుననే అంటున్నారు. ముద్రగడకు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఎవరికీ లేనంత వాల్యూ పెరిగిందంటున్నారు. ఆయన ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీకి కొంత హైప్ వస్తుందని అందరూ నమ్ముతున్నారు. నిజమే.. ముద్రగడను కాపు సామాజికవర్గం తమ నేతగా ఓన్ చేసుకుంటుంది. ఆయనను సొంతం చేసుకున్నట్లు మరే నేతను ఓన్ చేసుకోదు. అందుకు అనేక కారణాలున్నాయి.


ఆయన రాక కోసం...

ముద్రగడ నిజాయితీతో పాటు ఆయన తమ సామాజికవర్గం ప్రజలు వస్తే చూపించే ఆదరణ ఆయనకు ఆ స్థానాన్ని కల్పించాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట ఆ సామాజికవర్గానికి చెందిన యువత ఉండవచ్చు. కానీ ఎక్కువ మంది మాత్రం కాపు సామాజికవర్గంలో ముద్రగడకే జై కొడతారు. ఎందుకంటే ఆయన కాపుల కోసం నిలబడతారని, అవసరమైతే పదవులను అయినా త్యజిస్తారన్న భావన ఆ వర్గంలో ఉంది. అందుకే ముద్రగడ పద్మనాభం కోసం అన్ని పార్టీలూ ఎదురు చూస్తుంటాయి. ఆయన మద్దతు కోసం ప్రయత్నిస్తుంటాయి.
అత్యంత ఆదరణ కలిగిన...
కాపుల్లో అత్యంత ఆదరణ కలిగిన నేతగా ముద్రగడ పద్మనాభంకు గుర్తింపు ఉంది. పవన్ కల్యాణ్,చంద్రబాబు కలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంను వైసీపీ దగ్గరకు తీసే ప్రయత్నం చేస్తుంది. ఆయన కోరుకుంటే రాజ్యసభ పదవి కాని లేదంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీటు గాని ఇస్తామన్న ఆఫర్ ప్రకటించినట్లు తెలిసింది. ముదగ్రడ కాకపోయినా ఆయన ఆశీస్సులు పొందేందుకు ఆయన కుమారుడికి అయినా ఎమ్మెల్యే సీటు ఇచ్చి గౌరవించడానికి ఫ్యాన్ పార్టీ రెడీగా ఉంది. అయితే అంతిమ నిర్ణయం ముద్రగడదేనని వైసీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

ఆ రెండు పార్టీలు....
ముద్రగడ పద్మనాభం గత మూడున్నరేళ్లుగా యాక్టివ్ గా లేరు. తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు అస్సలు పడదు. తన కుటుంబాన్ని అవమానించిన విషయాన్ని ఇప్పటికీ ఆయన గుర్తు చేస్తున్నారు. ఇక జనసేన వైపు కూడా ఆయన చూసే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో సఖ్యతగా మెలుగుతున్నారు. ఈ కారణంతో ఆయన అటువైపు మొగ్గు చూపరంటున్నారు. ఇక బీజేపీలోకి వెళ్లే అవకాశాలు కూడా లేవు. దీంతో వైసీపీకి మద్దతుదారుగా ముద్రగడ పద్మనాభం నిలుస్తారని, వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయనే పార్టీకి కీలకంగా మారతారన్న టాక్ వినపడుతుంది. తాను సైలెంట్ గా ఉండి కుటుంబ సభ్యులను బరిలోకి దించుతారా? తానే స్వయంగా దిగుతారా? అన్నది తేలాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News