ఐఎఫ్‌సీఎన్‌ సస్టైన్‌–2025కు తెలుగు పోస్ట్ ఎంపిక

ప్రపంచవ్యాప్తంగా 25 ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సంస్థల్లో చోటు

Update: 2026-02-23 11:22 GMT

తెలుగు పోస్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అమెరికాలోని పోయింటర్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్‌ చెకింగ్ నెట్‌వర్క్ (IFCN) ప్రకటించిన సస్టైన్‌–2025 ప్రాజెక్ట్‌కు తెలుగు పోస్ట్ ఎంపికైంది. ఈ విడతలో ప్రపంచవ్యాప్తంగా 25 ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సంస్థలను ఆపరేషనల్‌ మద్దతు కోసం ఎంపిక చేశారు.

స్వతంత్ర న్యూస్‌రూమ్‌లు ఆదాయం తగ్గడం, డిజిటల్‌ వేదికల విధానాల్లో మార్పులు, ధృవీకరించిన సమాచారంపై ప్రజల ఆధారపడటం పెరగడం వంటి పరిస్థితుల్లో ఈ మద్దతు కీలకంగా మారింది.

ఆపరేషన్లకు బలం

ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌ ఆధారిత నూతన ఆవిష్కరణలపై నిధులు అందించిన IFCN, ఈసారి సస్టైన్‌ ప్రాజెక్ట్‌ను ప్రధాన కార్యాచరణ కొనసాగింపుపై దృష్టి పెట్టింది. సిబ్బంది నిర్వహణ, సంపాదకీయ నిరంతరత్వం, దీర్ఘకాల ప్రణాళికల రూపకల్పనకు ఈ మద్దతు ఉపయోగపడుతుంది. అంతరాయం లేకుండా ఫ్యాక్ట్‌ చెకింగ్‌ కథనాలు ప్రచురించేలా సహకారం అందిస్తుంది.

ఈ ఏడాది దక్షిణాసియా నుంచి ఎంపికైన రెండు సంస్థల్లో తెలుగు పోస్ట్ ఒకటి. దీంతో గ్లోబల్‌ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ వేదికలో భారత్‌ స్థానం స్పష్టమైంది. IFCN సూత్రాలను అనుసరిస్తున్న ధృవీకరిత సంతాకర్తగా తెలుగు పోస్ట్ ఖచ్చితత్వం, పారదర్శకత, ప్రజాహితం అనే ప్రమాణాలకు కట్టుబడి ఉంది.

శిక్షణ, భాగస్వామ్యాల విస్తరణ

2021లో స్థాపితమైన తెలుగు పోస్ట్‌ను ట్రూత్‌ సీరమ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. ఇది డిజిటల్‌ ప్రాధాన్యంతో పనిచేస్తున్న బహుభాషా వేదిక. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళం, మలయాళం భాషల్లో ఫ్యాక్ట్‌ చెకింగ్‌ కథనాలు ప్రచురిస్తోంది. ప్రతి నెల 68 లక్షలకుపైగా పాఠకులను చేరుకుంటోంది. ఇప్పటివరకు 3,900కుపైగా ఫ్యాక్ట్‌ చెకింగ్‌ కథనాలు ప్రచురించింది. వీటిలో అనేకం జాతీయ, అంతర్జాతీయ మాధ్యమాల్లో ప్రస్తావన పొందాయి.

“మాకు ఇది కీలకమైన సమయంలో వచ్చిన మద్దతు” అని తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్‌ చెక్‌ ఎడిటర్‌ సత్య ప్రియా బీఎన్ తెలిపారు. “ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ప్రజాసేవ జర్నలిజం. ప్రాంతీయ భాషల్లో తప్పుదారి పట్టించే సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. కానీ వనరులు పరిమితంగా ఉంటాయి. సస్టైన్‌ ప్రాజెక్ట్‌ మా పనిని ఎలాంటి రాజీ లేకుండా కొనసాగించే స్థిరత్వం ఇస్తుంది” అని చెప్పారు.

న్యూస్‌రూమ్‌ కార్యకలాపాల కొనసాగింపుతో పాటు, వార్తా సమాహార వేదికలు, ప్రైవేట్‌ ప్రకటనదారులతో భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని తెలుగు పోస్ట్ నిర్ణయించింది. ప్రకటనలు, సిండికేషన్‌ ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ, ఔషధ రంగ సంస్థలతో సీఎస్‌ఆర్‌ భాగస్వామ్యాలు విస్తరిస్తోంది. సైబర్‌ విజిలెన్స్‌, హైపర్‌ లోకల్‌ సివిక్‌ పేజీలు, క్లైమేట్‌ లిటరసీ కార్యక్రమాలకు మద్దతు పెంచుతోంది.

తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్‌ చెక్‌ అండ్‌ ఏఐ అకాడమీ ముఖ్య మైలురాయిగా నిలిచింది. డిజిటల్‌ ధృవీకరణ, తప్పుదారి సమాచారం గుర్తింపు, నైతిక సాంకేతిక వినియోగంపై శిక్షణ ఇస్తోంది. చెల్లింపు వర్క్‌షాప్‌లు, సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా ఆదాయం సృష్టిస్తూ, పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచుతోంది.

క్లైమేట్‌ చేంజ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆబ్జర్వేటరీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రధాన వాతావరణ ఘటనలపై డేటా సేకరణ, విశ్లేషణ, మ్యాపింగ్‌ చేస్తోంది. అపోహలను ఎదుర్కొంటూ ఆధారాలతో కూడిన ప్రజా చర్చను ప్రోత్సహిస్తోంది.

Tags:    

Similar News