కాంగ్రెస్ లో పెరిగిన ఆశలు... లెక్కలివేనట

తెలంగాణ కాంగ్రెస్ కు కొంత ఆశలు కన్పిస్తున్నాయి. ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో నేతలు ఉన్నారు.

Update: 2022-06-04 02:50 GMT

తెలంగాణ కాంగ్రెస్ కు కొంత ఆశలు కన్పిస్తున్నాయి. బీజేపీది వాపు తప్ప బలం లేదన్న నిర్ధారణకు కాంగ్రెస్ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలిగితే తమదే అధికారమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణపై పార్టీ అధినాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీ హైకమాండ్ ప్రత్యేక సర్వే చేయిస్తూ తప్పొప్పులను పార్టీ రాష్ట్ర నేతలకు ఎప్పటికిప్పడు తెలియజేస్తుంది. ప్రధానంగా ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను నియమించుకోవడంతో ఆయన బృందం ఇప్పటికే రెండుసార్లు సర్వే చేసినట్లు సమాచారం.

రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత...
ప్రధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీలో కొంత ఊపు కన్పిస్తుంది. ముఖ్యంగా యువతలో కొంత ఊపు కన్పిస్తుంది. తొలినాళ్లలో కొంత సీనియర్లు వెనక్కు లాగినా హైకమాండ్ వైఖరిని చూసి వెనక్కు తగ్గి రేవంత్ కు సహకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఐక్యంగా కన్పిస్తున్నారు. ఇదే ఐక్యత ఎన్నికల వరకూ కొనసాగించాలన్నది హైకమాండ్ ఆలోచన. అందుకే టిక్కెట్ల కేటాయింపు బాధ్యతను కూడా హైకమాండ్ తీసుకుంది. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.
నేతల్లో ఐక్యత...
జూన్ 1, 2వ తేదీల్లో జరిగిన నవసంకల్ప్ చింతన్ శిబిర్ లో కూడా పార్టీ నేతల్లో ఐక్యత కన్పించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేకపోయినా మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో చింతన్ శిబిర్ సక్సెస్ అయిందనే చెబుతున్నారు. బీజేపీకి 119 నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేదు. కాంగ్రెస్ కు అలా కాదు. ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతతో పాటు, క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
ప్రధాన సామాజికవర్గాలు....
దీంతో పాటు రైతు డిక్లరేషన్ తో పాటు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత పాదయాత్ర తేదీలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని తెలిసింది. అధికార టీఆర్ఎస్ ఎనిమిదేళ్లు పాలనపై అసంతృప్తితో ఉన్న వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. సామాజికవర్గాలుగా తమ వైపు మళ్లించేందుకు వ్యూహాలను రచిస్తుంది. ఒక సామాజికవర్గం ఇప్పటికే కాంగ్రెస్ కు దగ్గరయిందన్న వార్తలు వెలువడుతున్నాయి. మరో సామాజికవర్గం కూడా రేవంత్ ను చూసి కొంత సానుకూలతతో ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన సామాజికవర్గాలు దగ్గరవుతుండటంతో కాంగ్రెస్ లో ఆశలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ నేతలు ఇదే ఐక్యతను కొనసాగిస్తే అధికారపార్టీని నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News