అయ్యన్నకే చంద్రబాబు ఓటు.. అందుకేనట

2024 ఎన్నికల్లో తిరిగి అయ్యన్న పాత్రడికే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలిసింది

Update: 2022-10-05 04:18 GMT

నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై నిన్న మొన్నటి వరకూ సందిగ్దత నెలకొని ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో తిరిగి అయ్యన్న పాత్రడికే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలిసింది. ఆయన వైపే పార్టీ అధినేత మొగ్గు చూపుతున్నారు. అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఈసారి పోటీ చేస్తారన్న ప్రచారం పార్టీలో చాలా కాలంగా ఉంది. విజయ్ ఐటీడీపీీ సోషల్ మీడియా వింగ్ ను చూస్తున్నారు. అంతే కాకుండా పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ విజయ్ ముఖ్య భూమిక పోషించాల్సి ఉన్నందున అతడిని పోటీకి దింపలేమని చంద్రబాబు భావిస్తున్నారు.

ఐదుసార్లు గెలిచి...
నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్నపాత్రుడు అడ్డా అని చెప్పుకోవాలి. 1985లో ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరిన అయ్యన్న పాత్రుడు పార్టీలో సీనియర్ నేత. ఆయన ఇప్పటికి ఐదు సార్లు నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. నర్సీపట్నం అంటే అయ్యన్నపాత్రుడు అనేలా మార్చేశారు. 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా అయ్యన్నపాత్రుడు శిష్యుడే. రాజకీయాల్లో ఓనమాలు ఆయన నుంచే నేర్చుకుని నేడు ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే అయ్యాడనుకోండి.
అధినేత మాత్రం....
అయితే అయ్యన్నపాత్రుడు అయితే సానుభూతి పనిచేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై పెట్టిన కేసులతో పాటు అయ్యన్న ఇంటిని కూలదోసిన విషయం కూడా ఆయనకు కలసి వచ్చే అంశంగా చంద్రబాబు భావిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అయితేనే వైసీపీని ధీటుగా ఎదుర్కొనగలరన్న నమ్మకంతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకపడటంలోనూ ఇతర సీనియర్ నేతలకంటే అయ్యన్న పాత్రుడు ముందంజలో ఉన్నారు. పార్టీకి నమ్మకంగా పనిచేయడమే కాకుండా, సోదరుడు పార్టీ నుంచి వెళ్లిపోయినా జెండా పట్టుకుని నిలబెడ్డారని ఆయనపై చంద్రబాబుకు విశ్వాసం. అందుకే అయ్యన్న పాత్రుడు ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయ్యన్న సిద్ధపడకున్నా...
నర్సీపట్నంలో టీడీపీ టిక్కెట్ అయ్యన్న కుటుంబానికే అయినా.. ఈసారి విజయ్ కు ఇస్తారని అందరూ భావించారు. అయ్యన్న కూడా కుమారుడు విజయ్ ఎమ్మెల్యేగా అయితే చూడాలని భావించారు. ఈ మేరకు విజయ్ ను రాజకీయంగా యాక్టివ్ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం నర్సీపట్నం నియోజకవర్గంలో మాత్రం సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సీనియర్లలో ఇప్పటి వరకూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తర్వాత అయ్యన్నపాత్రుడికే చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారని అంటున్నారు. దీంతో అయ్యన్న ఆరోసారి నియోజకవర్గంలో గెలిచేందుకు ఇప్పటి నుంచే శ్రమపడుతున్నారు. అందుకే ఆయన నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సవాల్ విసరుతున్నారు.


Tags:    

Similar News