కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ..
విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం.. ఇండియా రూపాయి విలువను ప్రభావితం చేస్తోంది.
న్యూఢిల్లీ : డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమయింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం.. ఇండియా రూపాయి విలువను ప్రభావితం చేస్తోంది. సోమవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 0.3శాతం క్షీణించి 77.18కి పడిపోయింది. గతంలో రూపాయి కనిష్ట స్థాయి 76.98 ఉండగా.. ఇప్పుడు మరింత దిగిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుంచి ఈ ఏడాది 17.7 బిలియన్ డాలర్లను (బిలియన్ డాలర్ సుమారు రూ.7,500 కోట్లు) వెనక్కి తీసుకున్నారు.
విదేశీ పెట్టుబడిదారులు ఇంతపెద్దమొత్తంలో పెట్టుబడులను తీసుకోవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్బీఐ తో పాటు అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచడమేనని తెలుస్తోంది. ఈక్విటీల నుంచి వెనక్కితీసుకున్న పెట్టుబడులను డెట్ వైపు మళ్లిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం వంటివి కూడా రూపాయి పతనానికి కారణాలుగా తెలుస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల కరెంటు ఖాతా లోటు విస్తరించడం, ఆర్బీఐ 0.40 శాతం మేర రెపో రేను పెంచడం కూడా రూపాయిపై ప్రభావం చూపించే అంశాలే.