నేను వారిలా మాట్లాడలేను...

Update: 2018-08-13 14:14 GMT

ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్, నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం శేరిలింగంపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ దళిత, ఆదివాసి రైతులకు మూడుకరాలు భూమి ఇస్తామని మోసం చేసిందని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఐదు వేల ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని 10 వేలు కూడా ఇవ్వలేదన్నారు. నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు తెలంగాణ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని మిగులు రెవెన్యూతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ తో హామీల అమలు

నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు అన్ని బిల్లుల సమయంలో టీఆర్ఎస్ పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇచ్చిందని, మరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రెండు రాష్ట్రాలకు ఇచ్చిన అన్ని హామీలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. తాను కేసీఆర్, మోదీ చెప్పినట్లు ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానని, చందమామను భూమి మీదకు తీసుకువస్తానని అబద్ధపు హాము ఇవ్వలేనని, నెరవేర్చగలిగేవే చెబుతానన్నారు.

Similar News