అనుమానంతోనే హత్య చేశాడు

Update: 2018-05-11 07:23 GMT

తనను కాదని మరో అబ్బాయితో చనువుగా ఉంటోందనే అనుమానంతోనే ప్రేమోన్మాది చేతిలో డిగ్రీ విద్యార్థిని శిరీష హత్య జరిగిందని తెలుస్తోంది. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ లో శిరీషను స్నేహితుడే దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో శంకర్ పల్లి పోలీసులు నిందితుడు సాయిప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాయిప్రసాద్, శిరీష స్నేహంగా ఉంటున్నారు. కాగా, ఇటీవల శిరీష వేరే అబ్బాయితో చనువుగా ఉంటోందని సాయిప్రసాద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శిరీషపై కసి పెంచుకున్న సాయి ప్రసాద్ ఆమెను గొంతుకోసి దారుణంగా హత్యచేశాడని అనుమానిస్తున్నారు.

మాట్లాడుకుందామని పిలిచి...

శిరీషపై అనుమానంతో ఉన్న సాయిప్రసాద్ మాట్లాడుకుందామని, శంకర్ పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్ కు రమ్మని పిలిచాడు. దీంతో గురువారం ఉదయం ఇద్దరూ కలిసి రిసార్ట్స్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇంకో అబ్బాయితో ఎందుకు చనువుగా ఉంటున్నావని శిరీషను ప్రసాద్ ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. శిరీషపై మరింత కోపం పెంచుకున్న అతడు వెనకనుంచి కత్తితో గొంతుకోసి, ఛాతిపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు శిరీషను హత్య చేయడానికి ముందస్తు పథకంతోనే కత్తితో వచ్చాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గురువారం మధ్యాహ్నమే ఈ ఘటన జరిగినా రాత్రి వరకు బయటకు రాకుండా రిసార్ట్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మృతురాలి బందువులు మృతదేహంతో గురువారం రాత్రి రిసార్ట్ ముందు ఆందోళనకు దిగారు.

పెళ్లి చేసుకుందామంటే వినలేదు...

ఈ ఘటనలో నిందితుడు సాయిప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనను కాదని వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందనే కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు తనను పెళ్లి చేసుకోవాలని శిరీషకు చెప్పానని, అయినా వినలేదని సాయిప్రసాద్ విచారణలో అంగీకరించాడు. తాను ఆమెపై లైంగికదాడి చేయలేదని పోలీసులకు తెలిపాడు. శిరీష మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News