ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదిక్కడ

జరుగుతున్న అరాచకాలకు ప్రజలు సమాధానం చెప్పాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు

Update: 2021-11-20 07:06 GMT

జరుగుతున్న అరాచకాలకు ప్రజలు సమాధానం చెప్పాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నిన్నటి అసెంబ్లీ ఘటనపై బాలకృష్ణ స్పందించారు. దీనిపై బాలయ్య ఇప్పటికే ట్వీట్ చేశారు. నోటితో కాదు ఓటుతో ప్రజలు సమాధానం చెప్పాలని బాలకృష్ణ కోరారు. జరిగిన పరిణామాలు చాలా బాధాకరమన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన అసెంబ్లీ జరగనివ్వకుండా దృష్టి మరల్చారని బాలయ్య అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు ఇంటికి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు.

చాలా దారుణం....
వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు ధైర్యంగా ఉండేమనిషని, ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం దురదృష్టకరమని చెప్పారు. అసెంబ్లీలో అంశాలపై పోరాడాలి కాని, వ్యక్తిత్వహననానికి పాల్పడటం మంచిది కాదన్నారు. అసెంబ్లీలో మహిళ సభ్యులు కూడా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం జరగలేదన్నారు. వైసీపీ నేతలు వాడిన భాష సరైంది కాదన్నారు. అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిట్లో ఉన్నామా? అర్థం కాకుండా ఉందన్నారు.
సేవా కార్యక్రమాలతో....
నాసోదరి వ్యాపారాలను చూసుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని బాలకృష్ణ తెలిపారు. మీరు ఎప్పుడైనా దోచుకున్న డబ్బును దాచుకోవడం తప్ప సేవ చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఊరికే చేతులు కట్టుకుని కూర్చోలేదు ఇక్కడ అని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఈముఖ్యమంత్రి మంచి సలహాలు ఇచ్చినా తీసుకోరన్నారు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం అని చెప్పారు. ఇటీవల చంద్రబాబు నివాసం మీద దాడి జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంశాలపై మాట్లాడాలి కాని రాజకీయాలతో సంబంధాలు లేనివారిని తీసుకురావడం తగదన్నారు. మైండ్ గేమ్ మానుకోవాలని బాలకృష్ణ హితవు పలికారు.
బాబు అనుమతి ....
ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని బాలకృష్ణ అన్నారు. విర్రవీగి ఇష్టమొచ్చి మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇకపై చంద్రబాబు అనుమతి తమకు అవసరం లేదని గుర్తుంచుకోవాలని బాలకృష్ణ హెచ్చరించారు. ఇకపై మా జోలికి వస్తే ఊరుకోబోమని అని అన్నారు. ఇక సహించబోమని, భరతం పడతామని, ఖబడ్డార్ అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. నందమూరి కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు.


Tags:    

Similar News