సిద్దూ.. నిన్ను నమ్ముకుంటే?

. క్రికెటర్ గా సిద్దూకు ఉన్న ఫేమ్ ను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అతి ప్రాధాన్యత ఇచ్చింది.

Update: 2022-03-10 07:30 GMT

కాంగ్రెస్ వి నిలకడలేని రాజకీయాలు. కాంగ్రెస్ ను సుదీర్ఘకాలంగా నమ్ముకున్న నేతలను కాదని కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తారు. హైకమాండ్ తొలి నుంచి చేస్తున్న తప్పు ఇదే. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు నమ్మకంగా ఉంటున్న సింధియాను దూరం చేసుకుంది. అలాగే రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అమరీందర్ సింగ్ ను కూడా అకస్మాత్తుగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ వత్తిడి వల్లే అమరీందర్ ను పార్టీ దూరం చేసుకుంది.

ఆయన వల్లనే...
ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తుంది. సులువగా చేతికి చిక్కాల్సిన రాష్ట్రాన్ని సిద్దూను నమ్ముకుని చేజార్చుకుంది. సిద్దూ ఫక్తు పొలిటీషియన్ కాదు. క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. క్రికెటర్ గా సిద్దూకు ఉన్న ఫేమ్ ను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ ఆయనకు అతి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన ఏం కోరితే అది చేసింది. పీసీసీ చీఫ్ గా ఎన్నికలకు ముందు నియమించింది. నిజానికి ఈసారి కూడా పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఊహించారు.
కెప్టెన్ ప్రయత్నాలను...
బీజేపీ పై వ్యతిరేకతను అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొంత సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా రైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడు అమరీందర్ వారికి అండగా నిలిచారు. ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసింది ఎక్కువగా పంజాబ్ రైతులే. ఆ సమయంలో సిద్దూ అమరీందర్ కు చికాకు తెప్పించారు. అయితే సిద్ధూ తనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ కాంగ్రెస్ హైమాండ్ మాత్రం చరణ్ జిత్ సింగ్ చన్నీని నియమించింది.
కష్టాలన్నీ సిద్దూ నుంచే...
సీఎంగా చన్నీ నియామకం జరిగినప్పుటి నుంచి సిద్దూ చెలరేగి పోయాడు. పీీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరిక జారీ చేశారు. సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కష్టాన్ని తెచ్చిపెట్టాయి. అంతా తన చేతులు మీదుగానే జరగాలన్నది సిద్దూ అతి పోకడే పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు చూశారు. అందుకే పంజాబ్ ప్రజలు కాంగ్రెస్ ను పక్కన పెట్టారు.


Tags:    

Similar News