గంటలో పెళ్లి.. కట్నకానుకలతో వరుడు పరార్

సరిగ్గా గంటలో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లికొడుకు వధువు తరపున పుచ్చుకున్న కట్నకానుకలతో పరారయ్యాడు.

Update: 2021-12-16 05:12 GMT

పెళ్లి. జీవితంలో ఒకేఒక్కసారి వచ్చే ఒక అందమైన, మధురానుభూతి. పెళ్లి అనగానే.. ఆడపిల్లలు ఎన్నో కలలు కంటుంటారు. పెళ్లయ్యాక భర్తతో అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. తను కూడా ప్రేమగా చూసుకోవాలి.. ఇలా చాలానే ఉంటాయి. కానీ.. కలలు కన్న ప్రపంచం చూడకముందే పెళ్లి ఆగిపోతే.. ? మధురమైన అనుభూతుల్ని మిగల్చాల్సిన పెళ్లి వేడుక.. చేదు అనుభవాన్ని చూపిస్తే ఎలా ఉంటుంది ? ఇదే జరిగింది ఒక పెళ్లి వేడుకలో. గంటలో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఎక్కడో పక్క రాష్ట్రంలో కాదు. మన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోనే ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

పెద్దలు నిశ్చయించిన...
సంగారెడ్డి జిల్లా కందిమండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం మల్కాపూర్ కు చెందిన మాణిక్ రెడ్డితో వివాహం జరిపించేందుకు పెద్దలు ఈనెల12వ తేదీన ముహూర్తం నిశ్చయించారు. అంతా బాగానే ఉంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. సరిగ్గా గంటలో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లికొడుకు వధువు తరపున పుచ్చుకున్న కట్నకానుకలతో పరారయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో పెళ్లి ఇంటి నుంచి ఉడాయించాడు.
జంప్ అవ్వడంతో...
పెళ్లికి అంతా సిద్ధమవుతుండగా వరుడికి కట్న కానుకలుగా ఇచ్చిన డబ్బు, బంగారంతో జంప్‌ అయ్యాడు.ఈ విషయం బయటికి తెలిసిన మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు పరువు పోయిందని భావించి ఊరు విడిచి వెళ్లిపోయారు. దాంతో అంగరంగవైభవంగా జరగాల్సిన వివాహ వేడుక ఆగిపోయింది. వరుడు పరారవ్వడంతో వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో, న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వరుడు, అతని కుటుంబసభ్యుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



Tags:    

Similar News