Vikarabad: అక్కడికి వెళ్లాలంటేనే జనాలకు భయం.. ఎందుకో తెలుసా?

అటు అనంత పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రం.. ఇటు ఆనందం, ఆహ్లాదం పంచుతూ రా రమ్మనే టూరిస్ట్‌ స్పాట్‌ అనే చెప్పాలి..

Update: 2023-11-08 16:06 GMT

అటు అనంత పద్మనాభ స్వామి పుణ్యక్షేత్రం.. ఇటు ఆనందం, ఆహ్లాదం పంచుతూ రా రమ్మనే టూరిస్ట్‌ స్పాట్‌ అనే చెప్పాలి. ఇది హైదరాబాద్‌ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరి. అయితే ఇప్పుడు అక్కడకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు అందరిలో కొత్త భయం పట్టుకుంది. ఎందుకంటే చిరుతలు ఉన్నాయి జాగ్రత్త అంటున్నారు స్థానికులు. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో చిరుత పులుల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మొన్న పూడూరు మండలం దామగుండం అడవుల్లో, నేడు అనంతగిరి అడవిలో చిరుత సంచారం కలకల రేపింది. దామగుండం అడవుల్లో సీసీ కెమెరాకు చిరుత చిక్కింది. అనంతగిరిలో రోడ్డు దాటుతుండగా స్థానికులు చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు. అనంతగిరి పుణ్యక్షేత్రమే కాకుండా, టూరిస్టు స్పాట్‌ కూడా కావడంతో నిత్యం హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు ప్రజలు వెళుతుంటారు. దీంతో చిరుతల సంచారం ఇక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

అయితే వికారాబాద్ అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. అడవికి సమీపంలోని గ్రామస్తులు రాత్రి సమయంలో పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అటవీ అధికారులు సూచిస్తున్నారు. అనంతగిరి అడవిలోకి చిరుత రావడం మంచి పరిణామం అంటున్నారు జంతు ప్రేమికులు. అయితే అడవి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. చిరుత సంచారంతో అనంతగిరి పరిసర ప్రజలే కాకుండా హైదరాబాద్‌ నుంచి వెళ్లే టూరిస్టులు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అటవీ శాఖ అధికారులు. కాగా, ఈ మధ్య కాలంలో పులులు అడవుల నుంచి జన సంచారంలోకి వస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలకు కంటినిండ కునుకు లేకుండా చేస్తోంది. ఊరి పొలిమెరల్లోకి వస్తూ మేకలు, ఆవులు, ఎద్దులు, ఇలా పశువులపై దాడి చేస్తూ చంపేస్తున్నాయి.

Tags:    

Similar News