Telangana : తెలంగాణకు లక్ష కోట్ల పెట్టుబడులు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్ట్రేలియాలో పర్యటించారు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్ట్రేలియాలో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి లైఫ్సైన్స్ రంగంలో లక్ష కోట్ల కొత్త పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నిర్ణయించుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీంతో ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిర్వహించిన ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ప్రధానోపన్యాసం చేసిన ఆయన మాట్లాడారు.
ఆస్ట్రేలియా పర్యటనలో...
ఆస్బయోటెక్, విక్టోరియా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ తరఫున ‘రోడ్మ్యాప్–2030’ను రూపొందించి, రాష్ట్రాన్ని ప్రపంచ లైఫ్సైన్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు వేగవంతం చేసేందుకు సమగ్ర లైఫ్సైన్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు శ్రీధర్ బాబు చెప్పారు. జీవసాంకేతిక రంగంలో తదుపరి బయో–డిజిటల్ దశకు తెలంగాణ ముందడుగు వేస్తోందని ఆయన పేర్కొన్నారు.