Revanth Reddy : ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు
ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎల్పీ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై మాట్లాడారు. చిట్ చాట్ లతో కాలయాపన చేయవద్దని, వాటిని మానేయాలని సూచించారు. మంత్రులు కూడా ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని, వారి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలనికోరారు. ఎమ్మెల్యేలు సభకు సక్రమంగా హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సభకు హాజరు కాకుంటే అది వచ్చే ఎన్నికల్లో బీఫారం ఇవ్వడంలోనూ చూస్తామని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అనవసర విషయాలు మాట్లాడవద్దని...
సభలో సమస్యలపై మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందని అన్న రేవంత్ రెడ్డి అనవసర విషయాలను మాట్లాడవద్దని తెలిపారు. ప్రతి విమర్శకు సరైన కౌంటర్ ఇచ్చేలా పూర్తిగా సబ్జెక్ట్ పై స్టడీ చేసి రావాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఆదేశించారు. విధిగా బడ్జెట్ సమావేశాలకు అందరూ హాజరు కావాల్సిందేనని అన్నారు. సీఎల్పీ సమావేశానికి కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని,అయితే అనారోగ్య కారణాల వల్ల అయితే పరవాలేదని, కానీ కావాలని గైర్హాజరయితే మాత్రం ఉపేక్షించబోమని తెలిపారు. బడ్జెట్ లో విద్య, వైద్యానికి తగిన ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ ఇన్నోవేటివ్ గా ఉంటుందని అన్నారు.