ఉసురు తీసిన ఇంటర్ ఫలితాలు..తెలంగాణ 8 మంది విద్యార్థులు ఆత్మహత్య

ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతానన్న భయంతో సోమవారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం..

Update: 2023-05-10 07:13 GMT

తెలంగాణలో నిన్న (మే 9) ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొందరు, మార్కు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో ఇంకొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ విద్యార్థిని మనస్తాపంతో ఇల్లువదిలి వెళ్లిపోయింది. జగిత్యాలలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి (16) నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్న ఆత్మూర్ విద్యార్థి (17) మూడు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తిరుపతికి చెందిన విద్యార్థి (17) పటాన్ చెరులో ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాడు. ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతానన్న భయంతో సోమవారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి - మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య అతని మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్‌లో చదువుకుంటున్న గద్వాలకు చెందిన ఓ విద్యార్థి (17) ఇంటర్ ఫస్టియర్‌లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ ఇంటర్ (ఎంపీసీ) చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థిని ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
సికింద్రాబాద్ లో ఒకరు, ఖైరతాబాద్ లో మరొకరు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నారాయణ పేట జిల్లా కొత్తకోట కు చెందిన అమ్మాయి (17) మార్కులు తక్కువగా (365) వచ్చాయన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పటాన్‌చెరు సమీపంలోని పాటి గ్రామానికి చెందిన విద్యార్థిని భవాని ఇంటర్‌ సెకండియర్‌లో ఫెయిల్ అయిన మనస్తాపంతో అదృశ్యమైంది. భవాని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags:    

Similar News