Revanth Reddy : మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే శివతాండవమే
ఏది ఏమైనా మూసీ నది ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
ఏది ఏమైనా మూసీ నది ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మూసీ నదికి గోదావరి నదీ జాలాలను నింపుతామని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళనపై వేసిన కేసును వెనక్కు తీసుకోవాలని కోరారు.
ఆధ్యాత్మిక కేంద్రాలతో...
మూసీ నది ఒడ్డున శివాలయంతో పాటు, మసీదు, చర్చిలను కూడా నిర్మించనున్నామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డుపడితే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. నిత్యావసరాల కంటే ఈ మూసీ నది ప్రక్షాళన అవసరమని, ఇది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని అన్నారు. ఎవరైనా మూసీ నది ప్రక్షాళనకు అడ్డుపడితే ప్రభుత్వం శివతాండవం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని కోట్లు ఖర్చయినా భావితరాల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టినట్లు రేవంత్ వివరించారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరారు.