కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని కలెక్టర్లకు సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి.. వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని, ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలన్నారు.
గ్రామ వార్డు సచివాలయాల్లో...
గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలన్నారు. వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారరు.రాష్ట్రంలో ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కళాశాలల సేవలు ప్రజలకు అందేలా చూడాలి. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఇతర స్థానిక వైద్య సంస్థలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకే రిఫర్ చేయాలని, మెడికల్ కళాశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నారు.. వారి సేవలు సద్వినియోగం చేసుకోవా లని,
అనర్హులకు మాత్రం....
ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్) చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులకు కచ్చితంగా ప్రయోజనం జగరాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదని తెలిపారు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో మూడు లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగామని, సాంకేతికతను సరిగా వినియోగించుకోకపోవడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ది పొందారని చెప్పారు. రవాణా శాఖ డాటా ఆన్లైన్ పూర్తి చేయాలని, పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని, ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని, ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.